ఏపీలో 2014 పొత్తులే మరోసారి 2024లో : స్పష్టం చేసిన టీడీపీ సీనియర్ : మారుతున్న సమీకరణాలు..!!
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మూడు నెలలకే ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పాత మిత్రులను దగ్గర చేసుకొనే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా రాజధాని అమరావతి వ్యవహారం కేంద్రంగా రాజకీయం సాగగా.. ఇప్పుడు ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు..టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఇదే విషయాన్ని చాలా ఓపెన్ గా చెప్పేసారు. రాష్ట్రంలో 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలో దిగుతాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
2014లో కలిసి ఉన్నారు..వచ్చే ఎన్నికల నాటికి..
రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ..బీజేపీ కలిసి పోటీ చేసాయి. జనసేన అధినేత పవన్ సైతం వారికి మద్దతుగా నిలిచారు. ఆంధ్రులను కేసీఆర్ ద్వేషించారంటూ.. జగన్ అవినీతిని ప్రస్తావిస్తూ విమర్శలు చేసారు. చంద్రబాబు అనుభవం ఏపీకి అవసరమని..మోదీతోనే దేశం ముందుకు వెళ్తుందంటూ ప్రచారం సాగించారు. మోదీ..బాబు జోడి ఏపీకి అవసరమంటూ జగన్ పైన పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ ఎన్నికల్లో టీడీపీ..బీజేపీ సీట్లు పంపకాలు చేసుకోగా..పవన్ పార్టీ జనసేన మాత్రం పోటీ చేయలేదు. ఎన్నికల్లో టీడీపీ ఏపీలో..కేంద్రంలో బీజేపీ విజయం సాధించాయి. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ ప్రతిపక్ష నేత అయ్యారు. ఆ విజయం మీద జగన్ అనేక సార్లు కీలక వ్యాఖ్యలు చేసారు. మోదీ..పవన్ సహకారంతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటూ పలు మార్లు చెప్పుకొచ్చారు. ఇక, తరువాతి కాలంలో పవన్.. బీజేపీ నుండి టీడీపీ దూరం అయింది. ఇక, 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి వైసీపీ అధికారంలోకి రాగా..టీడీపీ ప్రతిపక్షానికి..జనసేన ఒక్క సీటుకు పరిమితం అయింది.
తిరిగి అదే పొత్తు కోసం ప్రయత్నాలు..
ఇప్పుడు వైసీపీ ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఏపీలో ప్రస్తుతం బలంగా కనిపిస్తున్న వైసీపీని ఎదుర్కోవాలంటే తిరిగి తమ పాత మిత్రులను దగ్గర చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందు కోసం ఎన్నికల కోసం వేచి చూడకుండా స్థానిక ఎన్నికల నుండే పొత్తులు పెట్టుకోవాలని టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. తాజాగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలో దిగుతాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోస్యం చెప్పారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలపై ఆసక్తిగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరవెనుక టీడీపీతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ పోటీచేసిన మంగళగిరిలో జనసేన అభ్యర్థిని నిలబెట్టకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. మరోవైపు ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారు. అవినీతి కేసుల నుంచి చంద్రబాబును కాపాడేందుకే వీరు బీజేపీలో చేరారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రాజధాని కేంద్రంగా కొత్త సమీకరణాలు..
అమరావతిని రాజధానిగా కొనసాగించటం పైన మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలతో కలకలం ఏర్పడింది. దీంతో..అక్కడ రైతులను టీడీపీ నేతలు బీజేపీ..జనసేన అధినేతల వద్దకు పంపి మద్దతు పొందేలా వ్యవహరించారు. ముఖ్యమంత్రి జగన్ పైన బీజేపీ నేతలు గతంలో ఎన్నడూ లేని విధంగా విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఏపీలో ఎదగాలని భావిస్తోంది. బీజేపీ నేతలు పవన్ తో సైతం టచ్ లో ఉన్నారని..పొత్తు పెట్టుకుంటారని ప్రచారం సాగుతోంది. ఇక, రాజధాని విషయంలో పవన్ నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసారు. అయితే, చంద్రబాబు మీద ప్రధాని మోదీ..అమిత్ షా వ్యతిరేకంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. కానీ, వారికి దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తెందని అయ్యన్న వ్యాఖ్యల ద్వారా స్పష్టం అవుతోంది. జనసేన అధినేత తొలి నుండి జగన్ లక్ష్యంగా పని చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు ఈ కొత్త సమీకరణాలు ఏపీలో ఎంత వరకు వర్కవుట్ అవుతాయి.. జగన్ వీరి కలయిన నిజంగా జరిగితే ఎలా ఎదుర్కొంటారో అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.