బోండా ఉమా తేల్చేసారు: న్యూజిలాండ్లో బంగీ జంప్.. నేరుగా వైసీపీలోకి ల్యాండ్ ? ఇది శాంపిల్ అంటూ..!
బోండా ఉమా. టీడీపీ వాయిస్ బలంగా వినిపించే నేతల్లో ముఖ్యులు. ఎన్నికల్లో ఓడిన తరువాత సైలెంట్ అయ్యారు. ఇక నాలుగు రోజులుగా తిరిగి మీడియాలో బోండా ఉమ భవిష్యత్ రాజకీయం గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. బోండా వైసీపీలో చేరటం ఖాయమని తెలుస్తోంది. అయితే, ఆయనకు ఎక్కడ బాధ్యతలు ఇస్తారనే దాని పైనే చర్చలు నడుస్తు న్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో విదేశాల్లో ఉన్న బోండా ఉమా తాజాగా తన ఫొటోలను విడుదల చేసారు. అందులో ఆయన గతంలో వైసీపీ అధినేత జగన్ న్యూజీలాండ్ పర్యటన సమయంలో బంగీ జంప్ చేసారు. ఇప్పుడు అదే ప్రాంతంలో బంగీ జంప్ చేసిన ఫొటో తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ఆసక్తి కర కామెంట్ చేసారు.
ఇది శాంపిల్ మాత్రమే..
విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఎన్నికల్లో ఓటమి తరువాత కాకి నాడలో జరిగిన టీడీపీ కాపు నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో విదేశీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చిన తరువాత బోండా ఉమాతో పాటుగా కొందరు నేతలను పిలిచి వారి సమస్యల పైన చర్చించారు. ఆ తరువాత తాము పార్టీ మారటం పైన బోండా ఉమా కొంత వెనక్కు తగ్గినట్లుగా కనిపించింది. అయితే, ఆయన వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో న్యూజిలాండ్లో ఉన్న బోండా ఉమా ఇక్కడ తన పార్టీ మార్పు గురించి జరుగుతున్న ప్రచారం పైన స్పందించలేదు. కానీ, తాను బంగీ జంప్ చేస్తున్న ఫొటోలను మాత్రం విడు దల చేసారు. అయితే ఈ ఫొటోలోనే అసలు విషయం ఉందనే చర్చ మొదలైంది. ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ ఫొటోతో పాటుగా హల్లో బెజవాడ.. నా తర్వాతి రాజకీయ అడుగు గురించి కూలంకష చర్చ జరుగుతున్న తరుణంలో నేను వేయబోతున్న సాహసమైన అడుగు ఇలా ఉండబోతోంది..ఇది ఒక శాంపిల్ అని పోస్ట్ పెట్టారు.
వైసీపీలో చేరిక ఖాయం..
గతంలో పాదయాత్రకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఫేమస్ అయిన బంగీ జప్ చేసిన జగన్ అందరి దృష్టిని ఆకర్షించారు. జగన్ చేసిన ఆ ఫీటు చూసి వైసీపీ అభిమానులు ఫుల్ హ్యీపీలో మునిగిపోయారు. ఇక, ఇప్పుడు టీడీపీ నేత బోండా ఉమా సైతం సరిగ్గా అదే న్యూజిలాండ్లో ఎక్కడైతే జగన్ బంగీ జంప్ చేసారో..సరిగ్గా అక్కడే బోండా ఉమా తాజాగా దర్శనమిచ్చారు. అందునా బంగీ జంప్ చేస్తూ ఫొటోలకు స్టిల్స్ ఇచ్చారు. ఆ ఫొటోలను ఇప్పుడు ఏపీలోని తన స్నేహితులకు షేర్ చేసారు. ఎన్నికల టెన్షన్..రాజకీయాల ఒత్తిడి నుండి పూర్తిగా రిలాక్స్ మూడ్లో ఉన్న బోండా ఉమా ఈ ఫొటోలో పూర్తి జోష్గా కనిపిస్తున్నారు. అయితే, తాను పార్టీ మారటం పైన మాత్రం ఎక్కడా స్పందించలేదు. పరోక్షంగా మాత్రం తాను సాహసమైన నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పటం ద్వారా పార్టీ మార్పు విషయం ఖరారు చేసినట్లుగా కనిపిస్తోంది. ఎక్కడా తన పార్టీ మార్పు వార్తలను ఖండిం చక పోవటం ద్వారా వైసీపీలో చేరటం ఖాయమని అర్దం అవుతోంది.
ఆ ఫొటోలు..పోస్టింగ్లతో చెప్పేసారు
అయితే, జగన్ ఎక్కడైతే బంగీ జంప్ చేసారో అక్కడే ఇప్పుడు బోండా ఉమా అదే బంగీ జంప్ చేయటం ద్వారా ఆయన మనసులోనూ విషయాన్ని బయట పెట్టేసారనే చర్చ సాగుతోంది. తాను జగన్ను ఫాలో అవుతున్నానే సంకేతాలు ఇచ్చారనే అభిప్రాయం ఏర్పడుతోంది. ఇదే సమయంలో ఈ ఫొటోలను విడుదల చేయటం వెనుక కూడా తన ఉద్దేశాన్ని మాటల ద్వారా కాకుండా.. ఫొటోల ద్వారా బయట పెట్టారనేది ఇప్పుడు ఈ మొత్తం మేటర్కు ముగింపుగా చెబుతున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ అయిదో తేదీన అమరావతికి తిరిగి రానున్నారు. సరిగ్గా అదే సమయానికి బోండా ఉమా సైతం తన విదేశీ పర్యటన ముగించి న్యూజిలాండ్ నుండి తన బంగీ జంప్తో నేరుగా సీఎం జగన్ వద్ద లాండ్ అవుతారంటూ చర్చ మొదలైంది.