చరిత రెడ్డి ఇన్..చల్లా రామకృష్ణా రెడ్డి ఔట్? టీడీపీలో మరో వికెట్: త్వరలో వైఎస్ఆర్ సీపీలోకి
కర్నూలు: ఎన్నికల ముంగింట్లో అధికార తెలుగుదేశం పార్టీకి మరో విఘాతం. సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణా రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణా రెడ్డి త్వరలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ గా పని చేస్తున్నారు. కర్నూలుజిల్లాలోని కోవెలకుంట్ల, ఆ తరువాత బనగాన పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పలుమార్లు గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ ప్రభుత్వం ఆయనను పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ గా నియమించింది.
గౌరు చరితా రెడ్డి చేరికకు నిరసనగా..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చల్లా రామకృష్ణా రెడ్డి పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. వైఎస్ఆర్ సీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆ అవకాశం దక్కకపోవచ్చని చల్లా వర్గీయులు భావిస్తున్నారు. గౌరు చరితకు టీడీపీ నుంచి పాణ్యం టికెట్ దాదాపు ఖరారైనట్టే.
చల్లా రామకృష్ణా రెడ్డి సొంత నియోజకవర్గం బనగానపల్లిలో ఇప్పటికే టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని తనకు టికెట్ ఇచ్చే అవకాశాలు దాదాపుగా లేవు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో కొనసాగితే.. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోవడం ఖాయమని నిర్ధారణకు రావడం వల్ల చల్లా రామకృష్ణా రెడ్డి పార్టీని వీడుతున్నారని చెబుతున్నారు. స్వగ్రామం అవుకు.. ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది.
వైఎస్ఆర్ సీపీలో వస్తే ఉపయోగం ఏంటీ?
వైఎస్ఆర్ సీపీలో చేరడం వల్ల చల్లాకు ఉపయోగం ఉంటుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. చల్లా కోరుకున్నట్టుగా, ఆయన సొంత నియోజకవర్గం బనగానపల్లి నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ బనగానపల్లి నియోజకవర్గం పరిధిలో బలహీనంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ తరఫున బనగానపల్లి నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. పైగా- పార్టీ కార్యకలాపాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఆయన మేనల్లుడే.
ఆయా కారణాల వల్ల బనగానపల్లి నియోజకవర్గం పరిధిలో కొత్త ముఖాలను వెదుకుతోంది వైఎస్ఆర్ సీపీ. అయినప్పటికీ.. బీసీ జనార్ధన్ రెడ్డికి ధీటైన నాయకుడు దొరకట్లేదు. ఈ పరిస్థితుల్లో చల్లా రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ సీపీలో చేరితే.. ఆయనకు బనగానపల్లి టికెట్ ఖాయమని వైఎస్ఆర్ సీపీ నాయకులు చెబుతున్నారు.