చంద్రబాబుకు మరో షాక్ - టీడీపీ పొలిట్బ్యూరోకు గల్లా అరుణ గుడ్బై....
టీడీపీ పొలిట్ బ్యూరోకు పార్టీ సీనియర్ నేత గల్లా అరుణ కుమారి గుడ్ బై చెప్పారు. పార్టీలో రాజకీయ నిర్ణయాలకు వేదికైన పొలిట్ బ్యూరో నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు ఆమె ఓ లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతోనే టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, మంత్రిగా కొనసాగిన గల్లా అరుణ.. వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. వైఎస్ మరణం తర్వాత కొంత కాలానికి ఆమె కుమారుడు, గల్లా జయదేవ్ తో కలిసి ఆమె టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో కమారుడు జయదేవ్ గుంటూరు ఎంపీగా గెలుపొందినా ఆమె మాత్రం క్రియాశీలంగా లేరు. పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్నప్పటికీ సమావేశాలకు కూడా తక్కువగా హాజరయ్యేవారు. ప్రస్తుతం కరోనా కారణంగా పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు ఆమె దూరంగానే ఉంటున్నారు.
తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి ఆమె తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలు మాత్రం తెలియరాలేదు. కుమారుడు గల్లా జయదేవ్పై వైసీపీలో చేరాలనే ఒత్తిడి వచ్చిందనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె పొలిట్ బ్యూరో నుంచి తప్పుకుని పార్టీలో కొనసాగడం అనుమానాలకు తావిస్తోంది. తాజాగా టీడీపీ ప్రకటించిన పార్లమెంటరీ కమిటీ పదవుల్లోనూ ఆమెకు చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారా అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి.