అది నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా: కరణం బలరాం
అమరావతి: 1978 నుంచి పదవున్నా, లేకపోయినా ప్రజలకు తాను సేవ చేస్తున్నానని టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలను కాపాడుకోలేనివాడు నాయకుడే కాదని ఆయన వ్యాఖ్యానించారు.
మనల్ని నమ్ముకుని నిత్యం మన వెంటే ఉండే కేడర్కు చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు వారిని కాపాడాల్పిన బాధ్యత ఆ పార్టీ నాయకుడికి ఉంటుందని అన్నారు. 1972 నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, 1978లో మొట్టమొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేఈ కృష్ణమూర్తి, తాను కాంగ్రెస్ (ఐ) నుంచి గెలిచామని, వైయస్ రాజశేఖరరెడ్డి ఆవుదూడ కాంగ్రెస్ నుంచి, వెంకయ్యనాయుడు జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తనను మూడో కొడుకుగా చూసుకునేదని ఈ సందర్భంగా ఆనాటి విషయాలను ప్రస్తావించారు. '1978లో ఎలక్షన్ టూర్ నిమిత్తం కర్ణాటక నుంచి ఒంగోలుకు వచ్చింది. ఆమెకు ఏర్పాటు చేసిన డయాస్ కూలిపోయింది. మాజీ ప్రధానిగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమెకు సరైన భద్రత కల్పించలేదు.
ఒక్క పోలీసోడు కూడా లేడు. అప్పట్లో ఉన్న నాయకులు ఆమెను ఏదో ఒక విధంగా ఇన్సల్ట్ చేయాలని చెప్పి, ఆమెకు సెక్యూరిటీ కూడా లేకుండా చేశారు. అ రోజుల్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న నేను స్వయంగా కారు నడుపుతూ ఆమెను మా జిల్లా దాటించాను.
ఇందిరాగాంధీని అలా నేను కాపాడిన తర్వాతనే ఆమె అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఒకసారి జరిగిన మీటింగ్లో 'బలరాం ఈజ్ మై థర్డ్ సన్' అని ఇందిరాగాంధీ బహిరంగంగా అందరి ముందు చెప్పందని అన్నారు. ఇంతకంటే ఏంకావాలి, వందల, వేల కోట్లు వస్తే ఆ తృప్తి వస్తుందా?' అని బలరాం అన్నారు.
కరణం బలరామంటే కత్తులు కటార్లు తప్పా, ఎటువంటి అభివృద్ధి ఉండదంటారు, నిజమేనా? అన్న ప్రశ్నకు ఆయన కరణం బలరాం అభివృద్ధి పనులు చేయలేదని ఎవరైనా సరే నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.
తన తన నియోజకవర్గంలోకి వెళ్లి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో చూడాలని అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు తన హయాంలో కట్టించిందేనని, ఆ ప్రాజెక్టు పుణ్యానే ఈరోజు ఒంగోలు ప్రజలు కూడా నీళ్లు తాగుతున్నారని అన్నారు. ఇదంతా అభివృద్ధి చేసినట్లు కాదా? అని ఆయన ప్రశ్నించారు.