షాడో హోం మంత్రిగా ఇక్బాల్..మాచర్ల సీఐ స్టేట్ రౌడీ: దాడి నిందితుడికి స్టేషన్ బెయిల్: పంచుమర్తి
గుంటూరు: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. గుంటూరు జిల్లా మాచర్లలో తమ పార్టీ నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వర రావులపై చోటు చేసుకున్న ప్రాణాంతక దాడులే దీనికి సాక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో పోలీసులను అడ్డు పెట్టుకుని అధికార పార్టీ యథేచ్ఛగా దాడులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
శుక్రవారం ఆమె గుంటూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా రాజకీయమయమైందని మండిపడ్డారు. రాష్ట్ర హోం శాఖకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ షాడో హోం మంత్రిగా తయారయ్యారని ఆమె విమర్శించారు. ఆయన ప్రోద్బలంతోనే తమ పార్టీ నాయకులపై ఇష్టానుసారంగా దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇంత భారీ ఎత్తున బుద్ధా వెంకన్న, బోండా ఉమాలపై మాచర్లలో దాడులు చోటు చేసుకుంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏం చేస్తున్నారని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. మాచర్లలో తమ పార్టీ నాయకులపై దాడి చేసిన వైసీపీ నాయకులు తురకా కిశోర్కు స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చారని నిలదీశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలోనే లేదని అనురాధ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
మాచర్ల సీఐ భక్తవత్సలం రెడ్డి ఓ స్టేట్ రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని, వారి ఆదేశాల మేరకే సీఐ పనిచేస్తున్నారని మండిపడ్డారు. తురకా కిశోర్కు స్టేషన్ బెయిల్ ఇవ్వడంలో ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా మాచర్ల సీఐ బేఖాతర్ చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ప్రభుత్వం పరిపాలిస్తోందా? లేక రౌడీలు పరిపాలిస్తున్నారా? అనే అయోమయం ప్రజల్లో నెలకొని ఉందని చెప్పారు.
తమ పార్టీ నాయకులను కిడ్నాప్ చేయడానికి వైసీపీ క్యాడర్ ప్రయత్నిస్తోందని, పోలీసులు వారికి సహకరిస్తున్నారని అన్నారు. మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా.. ఆయన తప్పించుకున్నట్లు తమకు సమాచారం ఉందని అనురాధ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవడానికి వైసీపీ నాయకులు అరాచకాలను సృష్టిస్తున్నారని విమర్శించారు.