పులివెందుల రౌడీలు అంటూ కామెంట్స్: టీడీపీ మూల్యం? రాజీనామా దిశగా సతీష్ రెడ్డి: వైసీపీలో..!
కడప: పులివెందుల రౌడీలు, కడప గూండాలు.. చాలాకాలం నుంచీ తెలుగుదేశం పార్టీ విస్తృతంగా వాడుతోన్న పదాలు ఇవి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి చేస్తోన్న ఈ వ్యాఖ్యలపై టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది. పులివెందులకే చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు, శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి పార్టీని వీడబోతున్నారని తెలుస్తోంది.
టీడీపీకి మాజీమంత్రి డొక్కా గుడ్బై: మొన్న మండలి సభ్యత్వానికి..నేడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి.. !
పులివెందులలో టీడీపీకి ఏకైక పెద్ద దిక్కు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక పెద్ద దిక్కు సతీష్ రెడ్డి. పార్టీ నుంచి ఎలాంటి అండ లేనప్పటికీ.. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడుతున్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా టీడీపీ అభ్యర్థిగా పులివెందుల నుంచి పోటీ చేయడం ఆయన ఆనవాయితీ. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సతీష్ రెడ్డి.. టీడీపీలో కొనసాగాలా? వద్దా? అనే విషయంపై పునరాలోచిస్తున్నారని అంటున్నారు.
గూండాలు, రౌడీలతో పోల్చడం పట్ల..
రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్నప్పటికీ.. దాన్ని పులివెందుల, కడప జిల్లాకు అపాదిస్తూ వస్తున్నారు టీడీపీ నాయకులు. దీనికి చంద్రబాబు గానీ, మాజీమంత్రి నారా లోకేష్ గానీ మినహాయింపు కాదు. మొన్నటికి మొన్న విశాఖపట్నం విమానాశ్రయం వద్ద చంద్రబాబుపై చోటు చేసుకున్న దాడి కూడా పులివెందుల గూండాలు, రౌడీల పనేనంటూ ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి వ్యాఖ్యల పట్ల పులివెందులకు చెందిన టీడీపీ నాయకులు స్థానికుల నుంచి కొంత ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారనే వార్తలు ఉన్నాయి.
సతీష్ రెడ్డి మనస్తాపం..
ఇలాంటి వ్యాఖ్యల పట్ల తాము ఇబ్బందులు పడుతున్నామనే విషయాన్ని సతీష్ రెడ్డి సహా స్థానిక నాయకులు కొందరు పార్టీ అగ్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఫలితం కనిపించలేదని అంటున్నారు. పైగా- విశాఖపట్నం ఘటన తరువాత ఈ రకమైన వ్యాఖ్యానాలు మరింత తీవ్రరూపం దాల్చడంతో సతీష్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని, తాను చేస్తోన్న ముందస్తు హెచ్చరికలను పార్టీ సీనియర్లు పెడచెవిన పెడుతున్నారనే ఆవేదన ఆయనలో వ్యక్తమౌతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగటం వల్ల ఉపయోగం లేదనే అభిప్రాయానికి వచ్చారని సమాచారం.
Recommended Video
పీఆర్తో పాటు..
అదే సమయంలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి అధికార పార్టీలో చేరడానికి సన్నాహాలు పూర్తి చేయడంతో.. ఇక ఆయనతో పాటు వైసీపీ తీర్థాన్ని పుచ్చుకోవడానికి సతీష్ రెడ్డి కూడా సిద్ధమయ్యారనే వార్తలు కడప జిల్లా రాజకీయాల్లో గుప్పుమంటున్నాయి. ఈ వార్తలను సతీష్ రెడ్డి తోసిపుచ్చకపోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. రామసుబ్బారెడ్దితో పాటు సతీష్ రెడ్డి కూడా రేపో, మాపో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.