మండలి కార్యదర్శి నియమాలను ఉల్లంఘిస్తున్నారు: ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు
వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయడంపై ఆంధ్రప్రదేశ్లో అగ్గిరాజేసుకొంది. శాసనమండలి చైర్మన్ షరీఫ్ తీసుకొన్న నిర్ణయాన్ని మండలి కార్యదర్శి అమలు చేయడం లేదని టీడీపీ మండిపడుతోంది. దీనిపై చట్టపరంగా.. పార్టీ పరంగా ముందుకెళతామని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని మండలి చైర్మన్ షరీఫ్ కార్యదర్శికి ఫైల్ పంపించారు. అయితే దానిని ఇదివరకే తిప్పి పంపించిన.. మండలి కార్యదర్శి... శుక్రవారం మరోసారి రిటన్ చేశారు. దీంతో మండలి కార్యదర్శి తీరును యనమల తప్పుపట్టారు. సభా నియమాలను కార్యదర్శి ఉల్లంఘించారని మండిపడ్డారు. అంతేకాదు దీనిపై సభ్యులు నోటీసు ఇవ్వొచ్చని కూడా సూచించారు.
మండలి కార్యదర్శి తీరుపై సభ్యులు నోటీసు ఇస్తే మండలి చైర్మన్ క్రమశిక్షణ చర్యలు తీసుకొనే అవకాశం ఉందని యనమల చెప్పారు. ఆ అధికారం మండలి చైర్మన్కు ఉందని స్పష్టంచేశారు. మండలి కార్యదర్శి తీరుపై పార్టీ పరంగానూ ఏం చేయాలనే అంశంపై ఆలోచిస్తున్నామని చెప్పారు.