సిగ్గుంటే రాజీనామా చేయాలి: జగన్ను టార్గెట్ చేసిన టీడీపీ బీజేపీ: అప్పీల్కు వెళ్లొద్దంటూ
అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టులో వ్యతిరేక తీర్పు రావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సారథ్యాన్ని వహిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు టార్గెట్గా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేష్కుమార్ను తొలగించడం, ఆ వెంటనే మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ను నియమించడం వంటి చర్యల పట్ల టీడీపీ ఎంత అక్కసుగా ఉందో ఆ పార్టీ నాయకులు చేస్తోన్న విమర్శలు అద్దం పడుతున్నాయి.
నిమ్మగడ్డ రీఎంట్రీ: రాజ్యాంగానికి, న్యాయవ్యవస్థ మధ్య: తవ్వి తీస్తోన్న సర్కార్: సుప్రీంలో
సిగ్గు ఉంటే రాజీనామా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాల్సిందేనంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని వారు స్వాగతించారు. ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందన్న నమ్మకాన్ని ఈ తీర్పు కలిగించిందని చెప్పారు. ఎన్నికల అధికారిని వైఎస్ జగన్ కులం పేరుతో దూషించారని, క్షమాపణ చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రికి సిగ్గు ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు వెళ్లడం ఎందుకు?
ఇప్పటిదాకా ప్రభుత్వం జారీ చేసిన అప్రజాస్వామికమైన జీవోలన్నింటీనీ హైకోర్టు కొట్టి వేసిందని, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని యనమల రామకృష్ణుడు అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నాయకులు సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని భావిస్తున్నారని, అక్కడా ఎదురుదెబ్బే తగులుతుందని చెప్పారు. సుప్రీంకోర్టు స్థాయిలో పరువు పోగొట్టుకుంటారని అన్నారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయకూడదని, హైకోర్టు ఆదేశాలను అమలు చేసి, ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని యనమల సూచించారు.
Recommended Video
అతి విశ్వాసానికి చెంపదెబ్బ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శించిందని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహా రావు, సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. దీనికి తగిన గుణపాఠం లభించిందని వారు అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో న్యాయమే గెలిచిందని వారు చెప్పారు. న్యాయం ఆయన పక్కన ఉండటం వల్లే హైకోర్టు జగన్ ప్రభుత్వానికి అక్షింతలు వేసిందని చెప్పారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్లినా.. తీర్పు విషయంలో పెద్దగా ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని వారు అభిప్రాయపడ్డారు.