జగన్ మరో స్కామ్.. అమరావతికి లింకు... ఎందుకు దాచారు... టీడీపీ సంచలన ఆరోపణలు...
108 అంబులెన్సుల నిర్వహణలో రూ.307కోట్ల కుంభకోణం జరిగిందని ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం... తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రమేయం ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ... అందులో భారీ అవకతవకలు జరిగాయని డాక్యుమెంట్స్తో మీడియా ముందుకొచ్చారు. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్లో భాగస్వామిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి... ఆ కంపెనీకి సంబంధించిన లీజులు,అనుమతులు,ఇతరత్రా విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని,కోర్టులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ బైలాస్లో సవరణలు...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో సరస్వతీ ఇండస్ట్రీలో తనకు భాగస్వామ్యం ఉందని పేర్కొన్నట్లు పట్టాభి తెలిపారు. ఆయన సతీమణి వైఎస్ భారతికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందన్నారు. దీని చరిత్రను పరిశీలిస్తే... సిమెంట్ పరిశ్రమ కోసం ఏర్పాటైన ఈ కంపెనీ మైనింగ్ లీజులు,అనుమతుల కోసం అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. 15.7.2008న సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ జనరల్ బాడీ మీటింగ్ జరిగిందని... ఇందులో బోర్డు డైరెక్టర్లుగా ఉన్న వైఎస్ జగన్,వైఎస్ భారతి,వైఎస్ విజయమ్మలు కూడా పాల్గొన్నారని చెప్పారు. అప్పటిదాకా ఆ సంస్థ బై-లాస్లో నేచర్ ఆఫ్ బిజినెస్ వపర్కు సంబంధించినవి మాత్రమే ఉన్నాయన్నారు.
సవరణలతో సంబంధం లేకుండానే భూ కేటాయింపులు...
ఆ సమావేశంలో కంపెనీ బైలాస్లో సవరణలు చేసి.. సిమెంట్ వ్యాపారాలను కూడా అందులో చేర్చారని పట్టాభి చెప్పారు. ఈ తీర్మానాన్ని వైఎస్ భారతి ప్రవేశపెట్టినట్టు చెప్పారు. కానీ అంతకంటే ముందే 12.6.2008న డైరెక్టర్ ఆఫ్ మైన్స్&జియాలజీ మెమో ఆధారంగా అప్పటికే సరస్వతీ ఇండస్ట్రీస్ సిమెంట్ కార్యకలాపాలకు భూకేటాయింపులు కూడా జరిగాయన్నారు. అంటే,ఆరోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి... బైలాస్ సవరణలతో సంబంధం లేకుండానే భూకేటాయింపులు జరిపారని ఆరోపించారు.భూకేటాయింపులు జరిపిన ఆ సంబంధిత శాఖకు సెక్రటరీ శ్రీలక్ష్మి అని చెప్పారు. వైఎస్ జగన్కు సంబంధించిన అనేక అవినీతి కార్యకలాపాల్లో ఆమె కూడా జైలుకు వెళ్లి వచ్చారని గుర్తుచేశారు.
జీవో.98తో మైనింగ్ లీజు రద్దు...
సరస్వతీ ఇండస్ట్రీస్కు లైమ్ స్టోన్ గనుల కోసం 613 హెక్టార్ల భూకేటాయింపులు జరిగాయన్నారు. చట్ట ప్రకారం రెండేళ్లలో ఆ భూముల్లో కార్యకలాపాలు ప్రారంభం కావాలని... కానీ అక్కడ ఎలాంటి పనులు మొదలుకాకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 17.2.2012, 2.6.2012 తేదీల్లో రెండు షోకాజ్ నోటీసులు జారీ చేసిందన్నారు. ఆ నోటీసులకు వచ్చిన సమాధానం సంతృప్తిగా లేకపోవడం వల్ల... మైనింగ్ డైరెక్టర్ సిఫారసుల మేరకు మైనింగ్ లీజును రద్దు చేస్తూ జీవో.98ని విడుల చేసిందన్నారు.
ఆ విషయంలో అమరావతి గుర్తుకొచ్చింది...
ఆ జీవో.98ని సవాల్ చేస్తూ సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ 6.11.2014న కోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. కోర్టులో ఆ పిటిషన్ పెండింగ్లో ఉండగానే... ఇండస్ట్రీస్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కాల పరిమితి పూర్తయిపోవడంతో ఫిబ్రవరి 19,2019న రెన్యువల్కు కూడా అప్లై చేసుకున్నారని చెప్పారు. మార్కెట్లో నెలకొన్న సంక్షోభం కారణంగా అనుకున్న సమయానికి కార్యకలాపాలు ప్రారంభించలేకపోయామని అందులో పేర్కొన్నట్లు చెప్పారు. అంతేకాదు,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణం చేపడుతోందని.. ఈ నేపథ్యంలో ఇక్కడ భవన నిర్మాణాలకు అవసరమయ్యే సిమెంట్ రీత్యా కంపెనీకి అనుమతులు ఇవ్వాలని అందులో కేంద్ర సంస్థను కోరినట్లు తెలిపారు.రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అమరావతి గుర్తుకురాని జగన్కు వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రం అమరావతి గుర్తుకొచ్చిందని పట్టాభి విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను గమనించాలని,అర్థం చేసుకోవాలనికోరారు.
తప్పుడు సమాచారం.. ఎందుకు దాచిపెట్టారు...
ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం చేసుకున్న దరఖాస్తులో భాగంగా ఫామ్-1కూడా నింపాల్సి ఉంటుందని.. అందులోనూ జగన్మోహన్ రెడ్డి అబద్దాలే చెప్పారని ఆరోపించారు. ఏ సైట్లో సిమెంట్ కంపెనీ ప్రపోజల్ పెట్టారో... దానికి సంబంధించిన జీవో ఏదైనా పెండింగ్లో ఉందా అన్న ప్రశ్నకు 'నన్' అని టిక్ పెట్టినట్టు చెప్పారు. జీవో.98 కోర్టులో పెండింగ్లో ఉందన్న విషయాన్ని ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. అంతేకాదు,ఆ భూ కేటాయింపులకు సంబంధించి ఏదైనా లిటిగేషన్ ఉందా అన్న ప్రశ్నకు కూడా నన్ అని టిక్ పెట్టారని ఆరోపించారు.చరిత్రలో ఏ ముఖ్యమంత్రైనా ఇలా తప్పుడు సమాచారంతో అనుమతులు పొందారా అని నిలదీశారు.
కోర్టునూ తప్పుదోవ పట్టించారని...
ఓవైపు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఫామ్లో సిమెంట్ గనుల కోసం కేటాయించిన భూముల్లో 25.4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని పేర్కొన్నారని... కానీ 15.10.2019న కోర్టులో జీవో.98 రద్దుపై జరిగిన తుది విచారణలో మాత్రం అవన్నీ ప్రైవేట్ భూములేనని అబద్దాలు చెప్పారని ఆరోపించారు. ప్రభుత్వ భూములకు వర్తించే సెక్షన్లు ప్రైవేట్ భూములకు వర్తించవని కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి తీర్పు అనుకూలంగా తెచ్చుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంత దిగజారుతారా అని ప్రశ్నించారు.