వైసీపీకి అనుకూలంగా ధర్మారెడ్డి: ఈసీ అధికారులకు లంచం ఇచ్చారా: ఎవరీ ధర్మారెడ్డి...ఎందుకిలా..!
చంద్రగిరిలో రీపోలింగ్ రగడ పతాక స్థాయికి చేరుతోంది. ఏకంగా ఎన్నికల సంఘంలో పని చేసే అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణల వరకూ వెళ్లింది. రీ పోలింగ్కు ఆదేశాలిచ్చేలా వైసీపీ తరపున ఢిల్లీలో ధర్మారెడ్డి చక్రం తిప్పారని టీడీపీ ఆరోపిస్తోంది. దీని పైనే కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులకు..టీడీపీ బృందం మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ ఆరోపిస్తున్న ఈ ధర్మారెడ్డి ఎవరు..ఏం జరిగింది...
లంచం ఆరోపణలు...
ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం రీ పోలింగ్కు ఆదేశించటం పైన టీడీపీ నేతలు మండి పడుతున్నారు. ఇదే వ్యవహారం పైన వారు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల తో సమావేశమైన సమయంలో తీవ్ర ఆరోపణలు చేసారు. ధర్మారెడ్డి అనే అధికారి వైసీపీకి అనుకూలంగా ఎన్నికల సంఘంలోని అధికారులకు లంచం ఇచ్చి..చంద్రగిరిలో రీ పోలింగ్కు అదేశాలు ఇప్పించారంటూ ఆరోపించారు. ఇదే వ్యవహారంపై ఎన్నికల కమిషన్ సభ్యులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసారు. ఇదే సమయంలో..ఏపీ సీఎస్తో పాటుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సైతం చంద్రగిరిలో రీపోలింగ్ నిర్వహణకు కారణాలను వెల్లడించారు. అక్కడి సీసీ ఫుటేజ్ చూస్తే అసలు అక్కడ ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. దళితులను ఓట్లు వేయనీకపోవటంతోనే ఆ కేంద్రాల్లో రీ పోలింగ్కు ఆదేశించామని చెబుతున్నారు.
ఎవరీ ధర్మారెడ్డి..ఏం జరిగింది..
వైసీపీకి అనుకూలంగా చంద్రగిరిలో రీ పోలింగ్ కోసం ధర్మారెడ్డి అనే అధికారి ఎన్నికల సంఘంలోని అధికారులకు లంచం ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలతో ఇప్పుడు ధర్మారెడ్డి పేరుపైన చర్చ జరుగుతోంది. ఏవీ ధర్మారెడ్డి ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సంయుక్తి కార్యదర్శిగా ఉన్నారు. ఆయన వైయస్ హయాంలో కేంద్ర సర్వీసుల నుండి ఏపీకీ డిప్యుటేషన్ పైన ఏపీకీ వచ్చారు. ఆయన టీటీడీ జేఈవోగా పని చేసారు. దీని పైన న్యాయపరంగా వివాదం సాగింది. దీంతో ఆయన కోసం ప్రత్యేకాధికారి పదవిని వైఎస్ ప్రభుత్వం కొత్తగా సృష్టించి అందులో నియమించింది.
రీ పోలింగ్కు అసలు కారణం...
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మాత్రం చంద్రగిరిలోని ఈ అయిదు కేంద్రాలతో సహా మరో రెండు కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని స్పష్టంగా చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లోని సీసీఫుటేజ్ ఈ విషయాన్ని స్పష్టంగా నిరూపిస్తోందని చెబుతున్నారు. పోలింగ్ కేంద్రంలోని అధికారులు రిగ్గింగ్కు సహకరిస్తే..తాము చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఆ అధికారుల పైన కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రకటించిన అయిదు కేంద్రాలతో పాటుగా మరో రెండు కేంద్రాల్లో రీ పోలింగ్కు సిఫార్సు చేసారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘంతో సమావేశమైన సమయంలోనూ ప్రస్తావించారు. దీని పైన టీడీపీ కోర్టును ఆశ్రయించింది. కోర్టులోనే ఆధారాలు అందిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో..ఇప్పుడు చంద్రగిరి రీ పోలింగ్ వ్యవహారం రగడ మరింత వేడి పుట్టించే అవకాశం ఉంది.