విమర్శల పదును పెంచిన తెలుగుతమ్ముళ్లు..! తగ్గేది లేదంటున్న వైసీపి నేతలు..!!
అమరావతి/హైదరాబాద్ : వైసీపి ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ విమర్శల జోరు పెంచింది. ఇంతకాలం స్థబ్దుగా ఉన్న టీడిపి నేతలు వైసిపీ ప్రభుత్వం విధానాలను ఎండగడుతున్నారు. అబద్ధాలకు కూడా ఇంత డబ్బు ఖర్చు చేయాలా అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిని టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ప్రశ్నించారు. వైసీపి ప్రభుత్వం తొలి 40 రోజుల పాలనపై వచ్చిన ప్రభుత్వ ప్రకటనలపై ఆయన స్పందించారు. జనవరి 2019 నుంచి జూన్ 2019 వరకు ఆరు నెలల పాటు తమ ప్రభుత్వం 2 వేల రూపాయలు ఫించన్ ఇచ్చిన సంగతి మర్చిపోయారా అంటూ జగన్ను ప్రశ్నించారు. ఆ మొత్తం ఆరు నెలల్లో ఐదు నెలల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వ ప్రకటనలో అబద్ధాలు సరికాదని హితవు పలికారు. ఈ మేరకు లోకేశ్ ట్విటర్లో పోస్టు చేశారు.
40 రోజుల పాలనలో నిరాశే మిగిలింది..! హామీల అమలులో వైసిపి తడబడుతోందన్న కోడెల..!!
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలు నిలిపివేయడంతో పని లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని టీడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆరోపించారు. తన కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, నిజంగా తప్పుంటే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా 40 రోజుల పాలనలో ప్రజలకు నిరాశే మిగిలిందని వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధిని నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇసుక లేకపోవటంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని తెలిపారు. పట్టిసీమ నీరు ఆలస్యం కావటంతో ఖరీఫ్ ఇంకా మొదలు కాలేదని... విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కినా పట్టించుకోని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రజావేదిక కూల్చటం ద్వారా సీఎం జగన్ ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్నారని అన్నారు. చంద్రబాబుని ఇల్లు ఖాళీ చేయించటంపై ఉన్న శ్రద్ధ జగన్కు ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని ఎద్దేవా చేశారు.
Recommended Video
జగన్ పాలనలో రైతులకు అన్యాయం..! మండి పడ్డ టీడిపి నాయకులు..!!
జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అన్ని విధాలా అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు సకాలంలో విత్తనాలు, నీరు కూడా ఇవ్వలేదని, ఏపీ సీడ్స్ విత్తనాలు తెలంగాణలో పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ చివరి రెండు విడతలు ఎందుకు ఇవ్వరంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు రుణమాఫీ ప్రకటించారు కాబట్టి రైతులకు అన్యాయం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా.. కేవలం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయటంపైనే దృష్టి సారించిందని విమర్శించారు.
గళం పెంచిన టీడిపి నేతలు..! పథకాల పట్ల ఘాటు విమర్శలు..!!
గత ప్రభుత్వ అవినీతిపై ఆధారాలు ఉంటే ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ది గాలికి వదిలిపెట్టి.. టీడీపీపై కక్ష్య సాదింపే లక్ష్యంగా పనిచేస్తున్నారని, లక్షల కోట్లు అవినీతి అని ప్రచారం చేశారని, ఒక్కరూపాయి అయినా నిరూపించారా? అని ఆలపాటి రాజా ప్రశ్నించారు. అంతే కాకుండా జగన్మోహన్ రెడ్డి రాజన్న రాజ్యం తెస్తామంటే రైతులు భయపడిపోతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అప్పటి రాజన్న రాజ్యంలో 14వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తూ ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారని, పెండింగ్ రుణమాఫీని ప్రభుత్వం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రైతు కష్టాలను ఇడ్లీ, ఉప్మాలతో పోల్చే వైసీపీకి చిత్తశుద్ధి ఉందా? అని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు.
జగన్ పరిపాలన వైఎస్ను మించిపోతుంది..! వైసీపి నేతల సంచలన ప్రకటన..!!
టీడిపి నేతలు తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపిస్తే ఆ క్షణమే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని గుంటూరు జిల్లా మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఆయన ప్రారంభించారు. అర్హులైన వారికి పెన్షన్లు పంపిణీ చేశారు. పింఛన్ల కోసం ఇకపై ఏ అధికారి, రాజకీయనేత చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అక్టోబర్ 2 నుంచి అర్హుల ఇళ్ల వద్దకే పింఛన్ అందిస్తామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి వేడుకలను విజయవాడలోని వైసీపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు వైసీపి నాయకులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వైఎస్ పాలనను మించి ముఖ్యమంత్రి జగన్ పరిపాలన ఉంటుందని అన్నారు. ఇవాళ్టి నుంచే వృద్ధులకు 2,250 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. రైతు సంక్షేమానికి జగన్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. వైఎస్ఆర్ కలలను జగన్ నెరవేర్చుతున్నరని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రైతుమిషన్ ను ఏర్పాటు చేయడమే కాకుండా రైతు సంక్షేమం కోసం జగన్ ఎంతో చేస్తున్నారని తెలిపారు.