పొత్తుపై తేల్చుకోవాల్సింది టీడీపీయే... బాబు వ్యాఖ్యలపై స్పందించిన పురందేశ్వరి, వీర్రాజు
విజయవాడ : బీజేపీతో పొత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి స్పందించారు. బీజేపీ మిత్రధర్మం పాటించడం లేదని చంద్రబాబు అనడం సమంజసం కాదని ఆమె అన్నారు.
బీజేపీ తమతో పొత్తు వద్దనుకుంటే...నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని చంద్రబాబు ఇవాళ మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే శనివారం పురందేశ్వరి దీనిపై స్పందిస్తూ.. తమతో కలిసి ఉంటారో... ఉండరో... టీడీపీనే తేల్చుకోవాలని అన్నారు.
పొత్తుపై హరిబాబుతో మాట్లాడొచ్చు...
బీజేపీతో పొత్తు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానమే చూసుకుంటుందని కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. తమతో పొత్తులో ఉండాలో, వద్దో తేల్చుకోవాల్సింది టీడీపీయే అని వ్యాఖ్యనించిన ఆమె.. ఒకవేళ టీడీపీకి ఉండాలనే ఉద్దేశం లేకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుతో మాట్లాడొచ్చు అని సూచించారు.
Recommended Video
అమిత్ షాకు లేఖ రాశా...
టీడీపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ పథకాలనే పేరు మార్చి తనవిగా చెప్పుకుంటోందని, పంచాయతీలకు నిధులు నేరుగా కేంద్రం నుంచే విడుదలవుతున్నాయని పురందేశ్వరి చెప్పారు. ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకోవాలంటూ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాసినట్లు కూడా పురందేశ్వరి తెలిపారు.
ఉంటారో, ఉండరో చంద్రబాబు ఇష్టం...
మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ...‘ చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించే సమయం ఆసన్నమైంది. మా పార్టీ అధిష్టానం త్వరలోనే స్పందిస్తుంది. చంద్రబాబు ఉండనంటే అది వారిష్టం..' అని వ్యాఖ్యానించారు.
మిత్రధర్మాన్ని టీడీపీ పాటిస్తుందా?
చంద్రబాబుకు పొత్తు ధర్మం ఇప్పుడు గుర్తొచ్చిందా?.' అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. అసలు టీడీపీ మిత్ర ధర్మం పాటిస్తుందా? ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధాని మోడీ ఫోటో పెట్టారు? కేంద్రంపై మీరు సుప్రీంకోర్టుకు వెళ్తారా? అలా కేసు వేస్తాననడం మిత్రధర్మం ఉల్లంఘన కాదా? అంటూ టీడీపీని, ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.