వైఎస్ఆర్సీపీతో ఎన్నికల అధికారులు కుమ్మక్కు..అందుకే రీపోలింగ్!
తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అయిదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు జారీ చేసిన ఆదేశాలపై తెలుగుదేశం పార్టీ భగ్గుమంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎన్నికల సంఘం అధికారులు కుమ్మక్కు అయ్యారని ఆరోపిస్తోంది. రీపోలింగ్ నిర్వహించాలంటూ వెలువడిన ఆదేశాలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. తిరుపతిలోని జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. నినాదాలు చేశారు. ధర్నాకు దిగారు. నిరసన ప్రదర్శలను నిర్వహించారు.
జిల్లాకు చెందిన మంత్రి అమర్నాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి పులివర్తి నాని సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆందోళనలతో హోరెత్తించారు. ఎన్నికల సంఘం అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలుగుదేశం పార్టీ గెలిచి తీరే నియోజకవర్గాల్లో ఉద్దేశపూరకంగానే ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసిందని అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని ఆరోపించారు. రీపోలింగ్ నిర్వహించాలంటూ వైఎస్ఆర్ సీపీ నాయకులు ఫిర్యాదు చేసిన వెంటనే- ఎన్నికల సంఘం అధికారులు సానుకూలంగా స్పందించారని, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందని వారు నిలదీశారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు ఫిర్యాదు చేయడం వెనుక కుట్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు. రీపోలింగ్ చేపట్టాలని తాము కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ- వారు పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు.
కిందటి నెల 11వ తేదీన పోలింగ్ ముగిసిన రెండో రోజు కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ తాను స్వయంగా వినతిపత్రాన్ని అందజేశానని పులివర్తి నాని చెప్పారు. దానిపై పట్టించుకోలేదని అన్నారు. నెల రోజుల తరువాత వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం అధికారులు ఆగమేఘాలపై స్పందించిందని ఆయన అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామాపురం, పులివర్తిపల్లి పోలింగ్ బూత్ లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, దళితులను ఓట్లు వేయనివ్వలేదంటూ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు, కొన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ఆయన జత చేసి మరీ.. వినతిపత్రాన్ని అందజేశారు. దీన్ని పరిశీలించిన తరువాత ఆయా బూత్ లలో రీపోలింగ్కు ఆదేశించారు అధికారులు.