మోడీ,అమిత్షా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు:వర్ల రామయ్య;ఆ వర్గాలకు రక్షణ లేదు:కారెం శివాజీ
Recommended Video
అనంతపురం:ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాలు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, వాళ్లు ఎన్ని 'గరుడ'లు...మరెన్ని ఆపరేషన్లు చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబును ఏమీ చేయలేరని టిడిపి నేత,ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య స్పష్టం చేశారు.
అనంతపురంలో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ..''కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్రపన్ని జాతీయస్థాయిలో పేరు సంపాదించుకున్న మా నాయకుడు చంద్రబాబును ఏదో ఒక కేసులో ఇరికించాలని చేస్తున్న కుయుక్తులు ఫలించవు. ఆపరేషన్ గరుడ పేరుతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తోంది'' అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ కేంద్రం రాజ్యాంగం ఖ్యాతిని తగ్గించే ప్రయత్నం చేస్తోందని, రాజ్యాంగం జోలికి వస్తే నాలుక తెగ్గోస్తామని హెచ్చరించారు.
ఏపీ ఎమ్మార్పీఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు ఎంఎస్ రాజు అధ్యక్షతన ఆదివారం అనంతపురంలోని ఆర్ట్స్కళాశాల మైదానంలో మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు జవహర్, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీతతో పాటు ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ, మేయర్ స్వరూప, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రమణయ్య, బేడ బుడగ జంగాల రాష్ట్ర అధ్యక్షుడు మధు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జవహర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో మాదిగల రిజర్వేషన్ వర్గీకరణ చేశారని, అప్పట్లో దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసిందన్నారు. కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వర్గీకరణ రద్దుచేశారన్నారు. జగన్ కరెప్సన్, పవన్కల్యాణ్ కన్ఫ్యూజన్లో ఉన్నారని, చంద్రబాబు మాత్రమే కమిట్మెంట్తో అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ..."రాష్ట్ర ప్రజలు మా నాయకుడు చంద్రబాబు వెంటే ఉన్నారు. భవిష్యత్తులో బీజేపీ పతనం తప్పదు. మహాభారతంలో కౌరవులు కుటిల రాజకీయాలు చేసి ఎలా పతనమయ్యారో.. అదే గతి ఆ పార్టీకి పట్టబోతోంది. పనికిరాని రాజకీయ నాయకుడు జగన్ను, అసమర్థ నేత పవన్కల్యాణ్ను అడ్డుపెట్టుకుని ప్రధాని మోడీ శిఖండి రాజకీయాలు చేస్తున్నారు'' అంటూ ఎద్దేవా చేశారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మాట్లాడుతూ, కేంద్రం రాజ్యాంగం ఖ్యాతిని తగ్గించే ప్రయత్నం చేస్తోందని, రాజ్యాంగం జోలికి వస్తే నాలుక తెగ్గోస్తాం అని హెచ్చరించారు. దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో దళితులు, మహిళలు అగ్రవర్ణాల ఆగడాలకు గురికావాల్సి వస్తోందన్నారు. రాజ్యాంగాన్ని తగులబెట్టాలని ప్రయత్నించిన దోషులను వెంటనే అరెస్టు చేయడంతో పాటు ఆర్ఎ్సఎస్, భజరంగదళ్ సంస్థలను రద్దుచేయాలని శివాజీ డిమాండ్ చేశారు. విభజన హామీలను అమలు చేయడంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. ప్రజలు సరైన సమయంలో సరైన రీతిలో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.