'శ్రీలక్ష్మి మాటేమిటి, భారతి తప్పించుకోలేరు, భార్యను లాగిందే జగన్'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు, మంత్రులు శనివారం నిప్పులు చెరిగారు. జగన్ సతీమణి భారతి పేరును ఈడీ ఛార్జీషీట్లో పెడితే తమకు ఏం సంబంధమని ప్రశ్నించారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, ఆదినారాయణ రెడ్డి, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమామహేస్వర రావు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తదితురులు ప్రతిపక్ష నేతపై విరుచుకుపడ్డారు.
భారతిపై ఛార్జీషీట్లో ట్విస్ట్!: 'ఈడీ ఉద్యోగులు టీడీపీ నేతల బంధువులు'
టీడీపీ నేతలపై ఆరోపణలు చేసిన జగన్ అసలు ఈడీ చార్జీషీట్లో భారతి పేరు ఉండటాన్ని కొట్టిపారేయలేదని ఎద్దేవా చేశారు. వైయస్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. జగన్ ఫ్యామిలీ ఇబ్బందులకు ఆయనే కారణమని ఆరోపించారు. జగన్ కారణంగానే 2014 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేసిన విజయమ్మ ఓడిపోయారన్నారు.
భారతి ప్రమేయం రుజువైనందువల్లే: ఆదినారాయణ రెడ్డి
జగన్కు సంబంధించిన పలు ఆర్థిక సంస్థలలో ప్రమేయం రుజువు కావడం వల్లే భారతి పేరును ఈడీ తన ఛార్జీషీట్లో పేర్కొందని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని జగన్ రాజకీయం చేయడం విడ్డూరమన్నారు. చట్ట ప్రకారం తీసుకున్న చర్యల విషయంలో పత్రికలు, న్యాయవ్యవస్థను తప్పుపట్టడం ద్వారా చట్టాల పట్ల అవగాహనా రాహిత్యం అర్థమవుతోందన్నారు. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన జగన్, రాజకీయాలపై అవగాహన సేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఇద్దరూ ఏపీ రాజకీయాల్లో ఉండటం ప్రజల దౌర్భాగ్యమన్నారు. వచ్చే రోజుల్లో టీడీపీ, బీజేపీ కలిసిపోతాయన్నారు. టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని పవన్ అనడం సరికాదన్నారు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోదన్నారు.
జయలలిత ధైర్యంగా ఎదుర్కొన్నారు, భారతి ఎదుర్కోవాలి: నక్కా
తండ్రి హయాంలో అక్రమంగా ఆస్తులు సంపాదించి ఇప్పుడు జగన్ యాగీ చేయడం విడ్డూరమని నక్కా ఆనంద బాబు అన్నారు. భార్య భారతిని కేసుల్లోకి లాగింది జగనే అన్నారు. ఇప్పుడు ఆ బురదను మాకు అంటించాలని చూడటం ఏమిటన్నారు. రాత్రి ఒకరితో పగలు ఒకరితో ఉండేది వైసీపీయే అన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి దగ్గరయ్యారన్నారు. అందుకే కేసుల్లో విచారణ నత్తనడకన సాగుతోందన్నారు. జయలలిత అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తే ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారని, అలా కేసులను ఎదుర్కోమని భారతికి చెప్పాలన్నారు.
పాపాలు బయటపడుతుంటే అధికారులకు బెదిరింపులా? దేవినేని
జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందని మంత్రి దేవినేని అన్నారు. జగన్కు ఉలిక్కిపాటు ఎందుకని ప్రశ్నించారు. నాడు కాంగ్రెస్తో కుమ్మక్కై రెండు సీబీఐ కేసులు వెలుగులోకి రాకుండా చూశారని, నేడు పాపాలు బయటకు వస్తుంటే ఈడీ అధికారులపై బెదిరింపు ధోరణులకు దిగుతున్నారని విమర్శించారు. విచారణ సంస్థలను తప్పు పట్టడం ఏమిటన్నారు. వైసీపీ సొంత పత్రిక ద్వారా టీడీపీపై, చంద్రబాబుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.
రుజువులు ఉన్నాయి
ఈడీ కేసులో జగన్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చెప్పడానికి జగన్ రాసిన లేఖనే నిదర్శనమని యనమల అన్నారు. తన భార్యకు సంబంధం లేదని ఆయన ఎక్కడా చెప్పలేదన్నారు. కేసులో ఆమె పేరు ఉందని న్యాయవాదులే చెబుతున్నారని, ఈ విషయాన్ని జగన్ ఖండించలేదన్నారు. అవినీతి చేయలేదని చెప్పలేని జగన్, పేపర్లలో వచ్చిన వార్తలపై ఎలా అభ్యంతరం చెబుతారని ప్రశ్నించారు. జగన్ పైన తాము చేసకిన ఆరోపణలకు రుజువులు ఉన్నాయన్నారు.
చట్టాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు
పది కంపెనీల్లో భారతి డైరెక్టర్గా ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. జగన్ అవినీతిలో ఆమె భాగస్వామే అన్నారు. భారతిపై ఈడీ కేసు దారుణమని జగన్ బాధపడిపోతున్నారని, ఆయనకు ఇప్పుడు మహిళలు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. అక్రమ సంపాదన కోసం ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి జీవితాన్ని జైలుపాలు చేసింది జగన్ కాదా అన్నారు. భార్య నిందితురాలిగా నమోదు కావడం నుంచి ఆయన సానుభూతి పొందాలని చూస్తున్నారన్నారు. జయ అక్రమాస్తుల కేసులో శశికళకు శిక్ష పడిందని, అలాగే మీ అవినీతి కేసుల్లో మీ పేరు ఉందని, చట్టాల నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. జగన్ చేసిన పాపాలే వారి కుటుంబ సభ్యులను తరుముతున్నాయన్నారు.