అరిస్తే అలుపొస్తుంది తప్ప గెలుపు రాదు: సాదినేని యామిని
అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం భవనంలో నీరు చేరటం, పైకప్పులు గాలికి ఎగిరిపోవడాన్ని తెలుగుదేశం పార్టీ తేలిగ్గా తీసుకున్నట్టుంది. సచివాలయంలో గాలికి ఎగిరిపోయినది టెంట్లు మాత్రమేనని, దీన్ని పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నానా యాగీ చేస్తున్నారంటూ టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని విమర్శించారు. గురువారం ఆమె వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
2014 పాఠం వైసీపీ మర్చిపోయిందా : టీడీపీని మించిపోతున్న వైసీపీ: అప్పుడే మంత్రులుగా....!
వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టేనా?
తన దృష్టిలో వైఎస్ఆర్ సీపీ అసలు రాజకీయ పార్టీనే కాదని సాదినేని యామిని విమర్శించారు. ఆ పార్టీ సభ్యులు ఏనాడూ అసెంబ్లీలో లేరని ఎద్దేవా చేశారు. వారికి సచివాలయం ఎక్కడ ఉందో కూడా తెలియదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వైఎస్ఆర్ సీపీ నాయకులు అదృశ్యమౌతుంటారని అలాంటి పార్టీ ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటేనని మండిపడ్డారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఆ పార్టీ ఏనాడూ పోరాటం చేయలేదని చెప్పారు.
శవ రాజకీయాలకు కేరాఫ్..
ప్రజలకు మేలు కలగాలని, మంచి జరగాలని కోరుకోని పార్టీ దేశంలో ఇంకేదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ఒక్కటేనని యామిని అన్నారు. శవ రాజకీయాలకు ఆ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, సంక్షేమానికి చిట్టచివరి వరుసలో కూడా కనిపించదని చెప్పారు. విజయసాయి రెడ్డి మతి భ్రమించిందని, నానాటికీ అది తీవ్రతరమౌతోందని చురకలు అంటించారు. మే 23వ తేదీన ఫలితాలు వెలువడిన తరువాత ఆయన విదేశాలకు పారిపోతారని అన్నారు. ఆయన విజయసాయి రెడ్డి కాదని వీసా రెడ్డి చెప్పుకొచ్చారు. ఈదురు గాలులు, భారీ వర్షాలకు సచివాలయంలో టెంట్ పడితే నానా యాగీ చేస్తున్న విజయసాయిరెడ్డికి అయిదేళ్ల కిందట విశాఖపట్నాన్ని వణికించిన హుద్ హుద్ తుఫాన్ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. హుద్ హుద్ తుఫాన్ సందర్భంగా చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడి, పరిస్థితులను చక్కదిద్దారని అన్నారు.
బీజేపీ కోసమే..
భారతీయ జనతాపార్టీకి లబ్ది కలిగించడానికి సాయిరెడ్డి తాపత్రయ పడుతున్నారని, తమ పార్టీని అవాస్తవ ఆరోపణలు చేయడానికి మాత్రమే ఆయన పనికొస్తారని యామిని అన్నారు. తమ పార్టీ గెలుస్తుందంటూ విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు కుప్పిగంతులు వేస్తున్నారని, వారి అరుపులు మే 23వ తేదీ వరకేనని, ఆ తరువాత వారంతా ఎటు వెళ్తారో వారికే తెలియదని అన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదని ఆమె జోస్యం చెప్పారు.