సాదినేని యామిని టీడీపికి షాక్ ఇవ్వబోతున్నారా..? బీజేపీలో చేరిక ఖాయమేనా? కన్నాతో భేటీ!
అమరావతి: తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడటానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. టీడీపీకి చెందిన మరో కీలక నాయకురాలు, పారిశ్రామికవేత్త సాదినేని యామిని పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా భారతీయ జనతాపార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారు. కాషాయ కండువాను కప్పుకోవడానికి ఆమె మంచి ముహూర్తాన్ని చూసుకోవడమే మిగిలి ఉందట. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ మీద ఈగ కూడా వాలనివ్వనంత అభిమానం ఉన్న మహిళా నాయకురాలిగా సాదినేని యామినికి గుర్తింపు ఉందని పార్టీ వర్గాలు తరచూ చెబుతుంటాయి. టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆమె తాజాగా బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరో చేరిక తప్పనట్టేనా?
అయిదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో కొనసాగింది తెలుగుదేశం పార్టీ. మొన్నటి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవి చూసింది. 175 స్థానాలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో 23 సీట్లకే పరిమితమైంది. 25 లోక్ సభ సీట్లల్లో మూడింటిని మాత్రమే గెలుచుకోగలిగింది. అధికారాన్ని కోల్పోయిన నెలరోజుల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీ ఖాళీ వలసల ప్రభావానికి గురైంది. పార్టీకి ఆర్థికంగా మూలస్తంభాలు అనే పేరున్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, అధికార ప్రతినిధి లంకా దినకర్, తెలంగాణ టీడీపీ నేత గరికపాటి రామ్మోహన్ రావులతో ఆరంభమైన వలసల తీవ్రత కొనసాగుతూనే వస్తోందనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాదినేని యామిని సైతం పార్టీని వీడబోతున్నారనే వార్తలు రావడం కలకలం రేపుతోంది.
తెలుగుదేశానికి డైహార్డ్ ఫ్యాన్ గా
తెలుగుదేశం పార్టీ డైహార్డ్ ఫ్యాన్ గా సాదినేని యామినికి పేరుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆమె టీడీపీని వీడే అవకాశాలు సైతం లేవనే అంటున్నారు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో.. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు అన్ని స్థాయిల్లో ఉండే నాయకులపై ఆమె నిప్పులు చెరిగిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అలాంటి నాయకురాలు తెలుగుదేశానికి గుడ్ బై చెప్పే అవకాశాలు దాదాపు లేవనే అంటున్నప్పటికీ.. నిప్పు లేనిదే పొగరాదనే సామెతను కూడా పార్టీ నాయకులు ఉటంకిస్తుండటం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన మాట వాస్తవమేనని అంగీకరిస్తున్నారు. పార్టీలో చేరాలనే ఉద్దేశంతో ఆమె కన్నా లక్ష్మీనారాయణను కలిసి ఉండే అవకాశాలు దాదాపుగా ఉండకపోవచ్చనే ఆశాభాావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో తరహాలోనే ఏపీలోనూ భారీ చేరికలకు శ్రీకారం..
తెలంగాణలో తరహాలోనే ఏపీలోనూ భారీ చేరికలకు శ్రీకారం చుట్టాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే- సాదినేని యామినికి పార్టీ తీర్థాన్ని ఇవ్వబోతున్నారని సమాచారం. తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాషాయ కండువాను కప్పుకోబోతున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఏపీలోనూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, టీడీపీ నాయకులను ఆకర్షించాలని భావిస్తోంది బీజేపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేక, తెలుగుదేశం పార్టీలో కొనసాగే పరిస్థితులను లేక.. తటస్థంగా కొనసాగుతున్న నాయకులను ఆకర్షించడానికి బీజేపీ ఇప్పటికే చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇదే ఊపును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు కమలనాథులు. స్థానిక సంస్థల ఎన్నికల్లోగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కసరత్తు ఆరంభించింది.
తెలంగాణలో గడ్డు కాలం..
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బీజేపీ తెలంగాణ శాఖ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే రాజ్యసభ టీడీపీ ఎంపీ గరికపాటి రాజారావు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ప్రోద్బలంతో పలువురు టీడీపీ నాయకులు కాషాయ కండువాను కప్పుకోవడానికి సిద్ధపడ్డారు. గరికపాటి రామ్మోహన్ రావుకు టీడీపీలో చాలా సంవత్సరాల పాటు కొనసాగిన అనుభవం ఉంది. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి. దీనితో గరికపాటి చొరవ వల్ల పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు బీజేపీలో చేరనున్నారు. కాంగ్రెస్, టీడీపీ నుంచి వస్తున్న నేతలు, కార్యకర్తలతో బీజేపీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రంలో 20లక్షల సభ్యత్వం పూర్తి చేయాలని ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన జాతీయాధ్యక్షుడు అమిత్షా ఆదేశించిన నేపథ్యంలో.. ఈ చేరికలు పార్టీకి మరింత ఊపును ఇస్తాయని ఆశిస్తున్నారు.