విగ్రహాల విధ్వంసం వెనుక పీకే వ్యూహం-జగన్ ఆదేశం- టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్
ఏపీలో తాజాగా చోటు చేసుకున్న విగ్రహాల విధ్వంసం ఘటనలకు గల కారణాలపై ప్రభుత్వం పలు దర్యాప్తులు చేస్తోంది. విగ్రహాల విధ్వంసం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ సవాంగ్ తరచుగా చెప్తున్నారు. అయితే ఆలయాల ఘటనలకు నిర్దిష్టమైన కారణాలను మాత్రం ప్రభుత్వం చెప్పలేకపోతోంది. దీంతో టీడీపీ నేత ఎన్బీ సుధాకర్రెడ్డి విగ్రహాల విధ్వంసానికి గల కారణాలపై చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఏపీలో చోటు చేసుకున్న ఆలయాల్లో విగ్రహాల విధ్వసం వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉన్నాయని టీడీపీ నేత డాక్టర్ ఎన్బీ సుధాకర్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రశాంత్ వ్యూహంతో జగన్ ఇచ్చిన ఆదేశాలకు ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వం వహించడం వల్లే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని సుధాకర్రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో సంక్రాంతి రోజు టీడీపీ అధికారి ప్రతినిధి సుధాకర్రెడ్డి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టి మర్చెందుకే విగ్రహాల విధ్వంసాలకు పాల్పడుతున్నారని సుధాకర్రెడ్డి చెప్పారు. విధ్వంసాల వెనక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహం దాగివుందన్నారు. విగ్రహాల ధ్వంసాలు జగన్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అండ ఉన్నందునే పోలీసులు నేరస్తులను పట్టుకోవడలో శ్రద్ద చూపడం లేదని సుధాకర్రెడ్డి విమర్శించారు. అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టారు, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు దొంగిలించారు, రామతీర్థంలో రాముని తల నరికారు ఇంకా విగ్రహాలపై వరుసదాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని సుధాకర్రెడ్డి ప్రశ్నించారు.
తాజాగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మిళిలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల ఖాలు చెక్కేయడం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని సుధాకర్రెడ్డి ఆరోపించారు. త్వరలో వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేసి ఆనేరాన్ని టిడిపిపై నెట్టేందుకు కట్ర పన్నుతున్నారని చెప్పారు. ఇటీవల జగన్ ను కలసిన ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో అల్లరులు, అశాంతి సృష్టించేందుకు వ్యూహ రచన చేశారనితెలిపారు. జగన్ పై కేసుల విచారణలు, పార్టీ నేతల అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుతంత్రాలు పన్నుతున్నారన్నారు.