అమరావతిలో భూములన్న వైసీపీ నేతలు వీరే: ఎమ్మెల్యేలు..మంత్రి కొడాలికి సైతం: టీడీపీ రివర్స్ ఎటాక్..!
రాజధాని ప్రాంతంలో టీడీపీ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని వైసీపీ ఎంతో కాలంగా ఆరోపణలు చేస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజున ఏకంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారి పేర్ల ను మంత్రి బుగ్గన ప్రకటించారు. తాజాగా.. వైసీపీ వీడియో ప్రజెంటేషన్ ద్వారా ఇన్ సైడర్ కు పాల్పడిన వారి పేర్లను..ఎంత మేర భూములను కొనుగోలు చేసిందీ వివరించారు. దీనికి టీడీపీ కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. టీడీపీ నేతల సంగతి సరే..రాజధాని ప్రాంతంలో భూములు కొన్న వైసీపీ నేతల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వారు భూములు కొన్న విషయాలను ఎన్నికల అఫిడవిట్ లోనూ ఉన్నాయని చెప్పుకొచ్చా రు. అయితే..వైసీపీ నేతలు భూములు కొనుగోలు చేసిన కాలాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. ఈ మొత్తం వ్యవహారం పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
వైసీపీ నేతలకూ భూములు..
ఇప్పటి వరకు అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి వేలాది ఎకరాల భూములు కొనుగోలు చేసారని వైసీపీ ఆరోపిస్తూ వచ్చంది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత దీంతో పాటుగా అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పైన మంత్రివర్గ ఉప సంఘం నియమించారు. గత నెల 27న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ సబ్ కమటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో..టీడీపీ నేతలు 4070 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని తేల్చింది. దీని పైన విచారణ బాధ్యత సీబీఐ లేదా లోకాయుక్తకు ఇచ్చే ప్రతిపాదన పైనా చర్చ సాగింది. అయితే, న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. తాజాగా వైసీపీ ఇదే అంశం పైన టీడీపీ నేతల వివరాలతో వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆ వెంటనే టీడీపీ సైతం రివర్స్ ఎటాక్ ప్రారంభించింది. అమరావతిలో వైసీపీ నేతలకూ భూములు ఉన్నాయంటూ జాబితా బయట పెట్టింది.
మంత్రి కొడాలితో సహా..ఎమ్మెల్యేలకు సైతం..
రాజధాని అమరావతి.. చుట్టుపక్కల పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు భూములు కొన్నారని తెదేపా నేతలు ఆరోపించారు. వారు కొంటే ధర్మం, వేరేవాళ్లు కొనుక్కుంటే అన్యాయమా అని ప్రశ్నించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు భూములు కొన్న విషయం వాళ్ల ఎన్నికల అఫిడవిట్లోనే ఉందని టీడీపీ నేతలు గర్తు చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి పోటీచేసి ఓడిపోయిన ఏసురత్నానికి అమరావతిలో బోలెడు భూములున్నాయని ఆరోపించారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త రెండెకరాలు కొన్నారని చెప్పుకొచ్చారు. మరో వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి అమరావతిలో 34 ఎకరాలుందని... మంత్రి కొడాలి నానికి అమరావతి పక్కనే ఉన్న నరుకుళ్లపాడులో 8 ఎకరాలుందని లెక్కలు చెప్పుకొచ్చారు. మీవాళ్లు కొంటే ధర్మం, న్యాయం.. ఎదుటివాళ్లు ఒక గజమో..ఎకరమో కొనుక్కుంటే అది అక్రమం.. అవినీతి.. ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతుందా అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా అమరావతి పక్కనే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారని... కొందరు వైసీపీ నాయకులకీ అక్కడ ఇళ్లున్నాయని చెబుతూ... అదీ ఇన్సైడర్ ట్రేడింగేనా అని నిలదీస్తున్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి..
ప్రభుత్వంలోని మంత్రులు..వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజముంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే విషయం పైన రాజధాని ప్రాంతంలో పర్యటన సమయంలో స్పష్టం చేసారు. తాము ఏపీలో అమల్లోకి తెచ్చిన బినామీ చట్టం సైతం ఉపయోగించాలని సూచించారు. రాజధాని తరలింపు కోసం ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించ టం సరి కాదని..తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీనికి వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. తొందర పడవద్దని..ఖచ్చితంగా జైళ్లో పెట్టమని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతల కోరిక నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. దీంతో..ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పైన రాజధాని రాజకీయం నడుస్తోంది.