రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక: టీడీపీ ఊహించని నిర్ణయం, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు
అమరావతి/న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గురువారం రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అధికార, విపక్షాలు డిప్యూటీ పదవి కోసం పోటీ పడుతున్నాయి. మరోవైపు పదవి దక్కించుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా మిత్రపక్షం జేడీయూ నేత హరివంశ్ నారాయణ సింగ్కు అవకాశం వచ్చింది.
డిప్యూటీ అంశంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మిత్రపక్షాల అభ్యర్థికి అవకాశం ఇవ్వడం ద్వారా.. ఇతర పార్టీల మద్దతు కూడగట్టవచ్చునని భావిస్తోంది. మరోవైపు జేడీయు నేత, సీఎం నితీష్ కుమార్.. హరివంశ్ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్, ఇతర విపక్షాలు కలిసి బీకే హరిప్రసాద్ను బరిలోకి దింపుతోంది.
పార్టీల మద్దతుతో హరిప్రసాద్
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు చెందిన బీకే హరిప్రసాద్ను నిలపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, సీపీఐ తదితర పార్టీల మద్దతుతో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా హరిప్రసాద్ను తెరపైకి తెచ్చింది కాంగ్రెస్. సీపీఐ నేత డీ రాజా ఆయన పేరును ప్రకటించారు. కాంగ్రెస్కు ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలు మద్దతిస్తున్నాయి.
Recommended Video
టీడీపీ ఊహించని, కీలక నిర్ణయం
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో తెలుగుదేశం పార్టీది దాదాపు ఊహించని, కీలక నిర్ణయమే అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి నిత్యం దూరం పాటించే టీడీపీ ఇటీవల దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది. అవిశ్వాసం సమయంలో ఇరువురు కలిశారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి టీడీపీ మద్దతిచ్చేందుకు సిద్ధమయింది. వైసీపీ కూడా ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వవద్దని నిర్ణయించింది. టీడీపీ.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వడం బీజేపీతో పాటు తెలుగు రాష్ట్రాల వారికి కూడా షాకే అని అంటున్నారు.
సుజనా చౌదరి ప్రకటన
టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ, తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు తరఫున తామంతా బీకే హరిప్రసాద్ (కాంగ్రెస్ అభ్యర్థి)కి మద్దతివ్వాలని నిర్ణయించామని టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి చెప్పారు.
ఇవీ బలాబలాలు
డిప్యూటీ చైర్మన్ పదవిని విపక్ష పార్టీల నుంచి తీసుకోవడమే సముచితంగా ఉంటుందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. డిప్యూటీ చైర్మన్ పదవి అధికార పార్టీ లేదా ఆ పార్టీ భాగస్వాములకు కాకుండా ఉండడానికే తాము ప్రాధాన్యం ఇస్తామన్నారు. కాగా, 245మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీయేకు 90 మంది ఎంపీలు ఉన్నారు. మెజార్టీకి 32 మందికి పైగా ఎంపీలు తక్కువ పడుతున్నారు. టీఆర్ఎస్, అన్నాడీఎంకే వంటి పార్టీలు మద్దతిచ్చే అవకాశముంది. విపక్షాలకు 112 మంది ఎంపీల మద్దతు ఉంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, టీడీపీ, ఎన్సీపీలు ఉన్నాయి. వీరికి 10 మంది తక్కువగా ఉన్నారు. అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్ వంటి పార్టీలకు దాదాపు ముప్పై మంది సభ్యులు ఉన్నారు. వీరు ఎటువైపు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరం.