పచ్చ చొక్కా వేసుకోలేదని...టిడిపి కార్యకర్తల నుంచి ఫైన్ వసూలు...ఎక్కడంటే
విశాఖపట్టణం జిల్లా: తన నియోజకవర్గం పరిధిలో ఏ స్థాయి పార్టీ సమావేశాలకు అయినా టిడిపి శ్రేణులు తప్పనిసరిగా పసుపు చొక్కాలతో రావాలని మాడుగుల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జి గవిరెడ్డి రామానాయుడు స్పష్టం చేశారు. ఆ ప్రకారం బుధవారం చీడికాడ, కె.కోటపాడు పార్టీ సమావేశాలకు పచ్చ చొక్కా వేసుకోకుండా వచ్చిన పార్టీ కార్యకర్తలు,మద్దతుదారుల నుంచి ఆయన నిలబెట్టి ఫైన్ వసూలు చెయ్యడం కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే...బుధవారం మాడుగుల నియోజకవర్గం పరిధిలోని చీడికాడ, కె.కోటపాడులో ఆ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు పచ్చ చొక్కాలు వేసుకోకుండా వచ్చినందుకు 28 మంది టిడిపి కార్యకర్తల నుంచి వంద రూపాయల చొప్పున రూ.2,800 జరిమానాగా వసూలు చేశారు. ఈ ఫైన్ చెల్లించిన వారిలో చీడికాడ మండలానికి చెందినవారు 18 మంది ఉండగా, కె.కోటపాడు మండలం నుంచి 10 మంది అపరాధ రుసుం చెల్లించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ ఈనెలలోనే 18 వ తేదీన జరిగే నియోజవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి, ఈ తరువాత మార్చి నెలలో జరిగే సమావేశాలకు పార్టీ శ్రేణులు పసుపు చొక్కాలు వేసుకోకుండా వస్తే రాకుంటే జరిమానా మరింత పెంచాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలా వసూలు చేసిన అపరాధ రుసుమును పార్టీ కార్యాలయానికే వినయోగిస్తామన్నారు. చీడికాడ పార్టీ కార్యాలయంలో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.10 వేలు ఇస్తానన్నారు. మిగిలిన వారు విరాళాలు వేసుకొని మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కె.కోటపాడులో సోషల్ మీడియా పోస్టర్లును ఆయన ఆవిష్కరించారు.
అయితే పార్టీ కార్యకర్తల నుంచి జరిమానా వసూళ్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కొందరు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చెయ్యగా మరికొందరు మాత్రం క్రమశిక్షణ కోసం ఈ తరహా చర్యలు తప్పవని సమర్థించారు.