రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే వైపే టీడీపీ- బీజేపీకి దగ్గరయ్యేందుకు మరో యత్నం- ఫలించేనా ?
2018లో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు నుంచి తప్పుకున్న తర్వాత బీజేపీపై ధర్మపోరాటం చేసిన టీడీపీ 2019 ఎన్నికల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కాషాయ పార్టీ విషయంలో పూర్తిగా మెత్తబడింది. ప్రస్తుత పరిస్ధితుల్లో దుర్బేద్యంగా కనిపిస్తున్న మోడీ-అమిత్షా ద్వయాన్ని ఎదుర్కొని సాధించేదేమీ లేదని తేలిపోవడంతో బీజేపీకి దగ్గరయ్యేందుకు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించింది. మోడీ 2 సర్కారు ఏర్పడిన కొత్తలోనే తమకున్న ఆరెస్సెస్ పరిచయాలతో మోడీ-అమిత్షాను కలిసేందుకు కూడా విశ్వప్రయత్నాలు చేసిన టీడీపీ .. అది కుదరకపోయినా పట్టు వీడలేదని తాజా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి.
సోము వీర్రాజు టీమ్ ఇదే: బీజేపీ పదాధికారుల లిస్ట్: టీడీపీ మాజీమంత్రులకు కీలక పోస్టులు
రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయేకే ఓటు..
నిన్న జరిగిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయేకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మిత్రపక్షం కాని టీడీపీ.. కూటమి నిలబెట్టిన హరివంశ్ నారాయణ్సింగ్కు మద్దతిచ్చింది. రాజ్యసభలో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఎన్డీయే అభ్యర్ధికే ఓటేశారు. అసలే రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కో ఓటు కీలకంగా మారిన నేపథ్యంలో టీడీపీ వేసిన ఆ ఒక్క ఓటు కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికలకు ముందు టీడీపీ తమ స్టాండ్ ఏంటో చెప్పకపోయినా చివరి నిమిషంలో ఎన్డీయేవైపు మొగ్గడంతో, మిగతా మిత్రపక్షాల ఓట్లు కలుపుకుని కూటమి అభ్యర్ధి సునాయాసంగా గట్టెక్కేశారు. అదే సమయంలో బీజేపీకి, తద్వారా ఎన్డీయేకు దగ్గరయ్యేందుకు టీడీపీ మరో ప్రయత్నం చేసినట్లయింది.
కాంగ్రెస్కు హ్యాండిచ్చేసినట్లే...
2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ సిద్ధాంతాలను సైతం పక్కనబెట్టి అనూహ్యంగా కాంగ్రెస్తో అంటకాగిన టీడీపీ.. జాతీయ స్ధాయిలో ఎన్డీయేకు వ్యతిరేకంగా 22 పార్టీలను కూడగట్టింది. కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్గాంధీతో కలిసి చంద్రబాబు లేపిన గత్తర అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే సమయంలో చంద్రబాబు వైఖరిపై ప్రధాని మోడీ, అమిత్షాతో పాటు బీజేపీ నేతలంతా దుమ్మెత్తి పోశారు. ఆ కోపం ఇప్పటికీ వారిలో కనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ను వదిలేసి బీజేపీతో స్నేహం కోసం టీడీపీ అర్రులు చాస్తుంటడం మారిన రాజకీయ పరిణామాలు అద్దం పడుతోంది. వాస్తవానికి 2019 ఎన్నికలు ముగిసిపోగానే కాంగ్రెస్కు రాంరాం చెప్పిసేన టీడీపీ.. అప్పటి నుంచి బీజేపీకి దగ్గరయ్యేందుకు చేయని ప్రయత్నం లేదు. అయినా ఇప్పటికీ మోడీ కరుణ లభించడం లేదు.
రాష్ట్రంలోనూ బీజేపీ అజెండాకు మద్దతు..
కేంద్రంలో బీజేపీకి దగ్గరయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న టీడీపీ.. రాష్ట్రంలోనూ ఆ పార్టీ అజెండాను మోస్తున్నట్లే కనిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న అంతర్వేది రథం దగ్ధంతో పాటు పలు మతపరమైన అంశాల్లో వైసీపీ సర్కారును టార్గెట్ చేస్తూ బీజేపీని మెప్పించేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అంతర్వేది ఘటనలో పవన్ కళ్యాణ్ తర్వాత సీబీఐ విచారణ కోరింది కూడా చంద్రబాబే. టీటీడీ వ్యవహారాల్లో సైతం బీజేపీకి మద్దతుగా టీడీపీ తీవ్ర పోరాటాలు చేస్తోంది. అందుకే రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ వైఖరిపై కాకుండా గత ప్రభుత్వంలో టీడీపీ వ్యవహారశైలిని తప్పుబడుతూ బీజేపీ నేతలు విమర్శించాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది.
Recommended Video
బీజేపీ కరుణిస్తుందా ?
2019 ఎన్నికలకు ముందు ఎంత మంది వారించినా వినకుండా బీజేపీతో పాటు ఎన్డీయేపై ధర్మపోరాటం ప్రకటించడమే కాకుండా అమిత్షాపై తిరుపతిలో రాళ్లు వేయించడం, మోడీకి వ్యతిరేకంగా నల్లజెండాల ప్రదర్శనలు చేయడం వంటి పరిణామాలు బీజేపీ నేతలు ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. బీజేపీ హైకమాండ్ కూడా ఈ విషయంలో చంద్రబాబును మరోసారి దగ్గరికి రానిచ్చేది లేదని ఇప్పటికే పలుమార్లు కుండబద్దలు కొట్టింది. వాస్తవానికి ఇప్పుడు రాష్ట్రంతో పాటు పార్లమెంటులోనూ బలంగా కనిపిస్తున్న వైసీపీని కాదని టీడీపీని చేరదీయాల్సిన అవసరం బీజేపీకి కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి లేదా మధ్యలో జమిలి ఎన్నికలు వస్తే అప్పటి పరిస్ధితుల ఆధారంగా ఏమైనా అవకాశం దక్కాలే కానీ ఇప్పట్లో మాత్రం టీడీపీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేవనే చెప్పవచ్చు.