మీ వల్లే: ఐపిఎల్ పేరు చెప్పి కాంగ్రెస్పై తోట ఫైర్, సుష్మాకు టిడిపి అండ
న్యూఢిల్లీ: లలిత్ మోడీ విషయంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు అండగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ లోకసభాపక్ష నేత తోట నర్సింహం బుధవారం నాడు మాట్లాడారు.
సుష్మా స్వరాజ్ పైన ఆరోపణలు నిరాధారం అని చెప్పారు. ఐపిఎల్ కుంభకోణం జరగకుండా యూపిఏ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. యూపిఏ ప్రభుత్వం చేతగానితనం వల్లే ఐపిఎల్ కుంభకోణం జరిగిందని ధ్వజమెత్తారు.
లలిత్ గేట్ అంశంపై లోకసభలో బుధవారం చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే చర్చను ప్రారంభించారు. సుష్మా స్వరాజ్ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత పలువురు సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా తోట నర్సింహం మాట్లాడారు.
సభలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు: దినేష్ త్రివేది
తాను 1990 నుంచి లోకసభ సభ్యుడి ఉన్నప్పటికీ సభలో ఇలాంటి దారుణ పరిస్థితి ఇప్పటివరకు చూడలేదని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు దినేష్ త్రివేది ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ ప్రజలతో పాటు ప్రపంచమంతా మనవైపే చూస్తోందన్నారు. సభ్యుల ప్రవర్తన సభా సంప్రదాయాలకు భిన్నంగా ఉంటే ప్రజలు హర్షించరని వ్యాఖ్యానించారు. లలిత్ మోడీ అంశంపై మొదటినుంచీ చర్చ చేపట్టాలనే తాము కోరుతున్నామన్నారు.
ఐపిఎల్ కుంభకోణాల పుట్ట: వేణుగోపాల్
ఐపిఎల్ కుంభకోణాల పుట్ట అని అన్నాడిఎంకే ఎంపీ వేణుగోపాల్ అన్నారు. వందల కోట్లు దుర్వినియోగం అయ్యాయని చెప్పారు. లలిత్ మోడీని ఈడి ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించిందన్నారు. ఆయనను భారత్కు రప్పించి శిక్షించాలన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నా ప్రభుత్వం మిన్నకుండవద్దన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్థిక నేరస్థుడిపై చర్యలు తీసుకోవాలన్నారు.