జగన్ పై సమరమే : ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ: ఇక్కడి నుండే సమస్యులు మొదలా..!
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఒక వైపు జగన్ గత ప్రభుత్వంలో అక్రమాలను వెలికి తీసే పని ప్రారంభిస్తుంటే..ఇటు చంద్రబాబు సైతం తొలుత వేచి చూసే ధోరణి ఉందామని భావించినా..జగన్ దూకుడుతో నిర్ణయం మార్చుకున్నారు. ఇందు కోసం ఎమ్మెల్యేల సమావేశంలో కార్యాచరణ ఖరారు చేయనున్నారు. జగన్ పైన ఇక సమరం ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే సమయంలో స్థానిక ఎన్నికల సమరంలో టీడీపీ సత్తా చాటాల్సిందేనని చంద్రబాబు గట్టిగా చెబుతున్నారు.
మంత్రుల ప్రమాణ స్వీకారానికి స్వామీజీకి ఆహ్వానం ? అందుకేనా జగన్ విశాఖ పర్యటన
ఇక ప్రభుత్వం పైన సమరమే...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొంత కాలం ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని తొలుత ప్రతిపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. అయితే, ముఖ్యమంత్రిగా జగన్ రాజధాని..పోలవరం..ప్రాజెక్టులకు అడ్వాన్స్ లు..గతంలో ఇచ్చిన కాంట్రాక్టుల రద్దు వంటి నిర్ణయాలతో ఇప్పుడు చంద్రబాబు తన నిర్ణయం మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో..ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ నెల 7న విదేశీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు తిరిగి 14న అమరావతికి చేరుకుంటారు. ఈనెల 12 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లో నిర్ణయించిన అజెండా మినహా..ఇతర అంశాలు ప్రస్తావించే అవకాశం లేదు. దీంతో..ఇప్పటికే జగన్ దూకూడు..టీడీపీ అవినీతి చేసిందనే సంకేతాలిచ్చేలా ఉందని..దీనిని ఖండించకపోతే ఇబ్బందులు తప్పవని టీడీపీ భావిస్తోంది. దీంతో..ఈ సమావేశంలో కార్యాచరణ ఖరారు చేయనుంది.
ఏపీ భవనాల అప్పగింత అంశం మీద..
రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని ఏపీకి చెందిన భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసారు. అంతకు ముందే ఏపీ ప్రభుత్వం దీనికి సమ్మతిస్తూ గత నెల 31న సర్క్యులర్ జారీ చేసింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం నుండి ఏపీకీ రావాల్సిన ప్రయోజనాల పైన పట్టుబట్టకుండా ఏకపక్షంగా ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ యోచిస్తోంది. అయితే, ఇప్పుడే ఇటువంటి అంశాల పైన స్పందిస్తే..ప్రజల్లో ఎటువంటి సంకేతాలు వెళ్తాయనే కోణంలోనూ టీడీపీ ఆలోచన చేస్తోంది. దీంతో పాటుగా రాజధాని..పోలవరంలో అవినీతి జరిగిందనే సంకేతాలు జగన్ ఇస్తున్నారని..ఇవి టీడీపీకి నష్టమని అంచనా వేస్తున్న టీడీపీ..రాజధాని-పోలవరం పక్కన పెట్టేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో మొదలైందని..దీనిని అనుకూలంగా మలచుకోవాలని టీడీపీ భావిస్తోంది.
స్థానిక సంస్థల్లో సత్తా చాటుదాం..
సార్వత్రిక ఎన్నికల్లో మార్పు కోరుకున్న ప్రజలు వైసీపీకి పట్టం కట్టారని..స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని టీడీపీ అధినేత చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఎన్నికల జోష్ కొనసాగించి స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకోవటానికి జగన్ ఎత్తుగడలు వేస్తున్నారని..దీనిని సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచిస్తున్నారు. దీంతో..కుప్పంతో మొదలు పెట్టి..సాధ్యమైనంత వరకు నియోజకవర్గాల్లో పర్యటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే సమయంలో..క్షేత్ర స్థాయిలో కేడర్ వైసీపీ వైపు మళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో అసలు ఎంత మంది ఎమ్మెల్యే హాజరవుతారు..ఎటువంటి సమస్యలు ప్రస్తావిస్తారనే దాని పైనా టీడీపీలో ఉత్కంఠ కనిపిస్తోంది.