#JaganFailed CM: సోషల్ మీడియాలో హల్ చల్: రాజధాని విషయంలోనూ..ఇలా..!
ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా నెగటివ్ క్యాంపెయిన్ నడుస్తోంది. ప్రత్యేకంగా హాష్ టాగ్స్ తో జగన్ ఫెయిల్డ్ సీఎం అనే పేరుతో వ్యతిరేక పోస్టింగ్ లు.. కామెంట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా పీపుల్స్ కేపిటల్ అమరావతి పేరుతో మరో క్యాంపెయిన్ కొనసాగుతోంది. 2019 ఎన్నికల ముందు వైసీపీ మద్దతు దారులు టీడీపీని డామినేట్ చేసే విధంగా సోషల్ మీడియాలో ఆధిపత్యం ప్రదర్శించారు.
కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ రాజకీయ ప్రత్యర్ధులు వ్యతిరేక ప్రచారం చేయటం కోసం స్పెషల్ టీమ్స్ వినియోగిస్తున్నారు. ఇందులో కేవలం ఏపీ నుండే కాదు..ఈ రెండు రకాల ప్రచారాల్లో జాతీయ స్థాయిలోనూ..అదే విధంగా వివిధ రంగాల్లో స్థిర పడిన ప్రముఖులు..ఎన్నారైలు సైతం తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఈ సందర్భంలో ఇదే సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో మాత్రం వైసిపి వెనుకబడి ఉన్నట్లుగా కనిపిస్తోంది.
చంద్రబాబు భావోద్వేగం: అక్కడ మట్టికి సాష్టాంగ నమస్కారం: నాడు ప్రధాని మోదీతో..!
జగన్ వైఫల్య ముఖ్యమంత్రిగా..
#Jagan FailedCM ఈ నినాదంతో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. అందునా ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన ప్రారంభం ముందు ఒక్క సారిగా అధిక సంఖ్యలో సీఎం జగన్ కు వ్యతిరేకంగా పోస్టింగ్ లు పోస్ట్ అయ్యాయి. అందులో అధిక శాతం టీడీపీ మద్దతు దారులవిగా చెబుతున్నారు. ఇతరులు సైతం పోస్టింగ్ లు పెట్టారు. ఆరు నెలల కాలంలో ముఖ్యమంత్రి ఒక విఫలమైన సీఎంగా ప్రచారం చేయటం ఈ పోస్టింగ్ ల లక్ష్యంగా కనిపిస్తోంది.
@ jai tdp పేరుతో పలు పోస్ట్ లు కనిపిస్తున్నాయి. జగన్ జైలులో ఉన్నట్లుగా ఉన్న ఫొటోలను సైతం ఇందులో దర్శనమిస్తున్నాయి. ఇక, రాజధాని గురించి ప్రత్యేకంగా జాతీయ మీడియాలో వచ్చిన కధనాలు..ఏపీ సీఎం పాలనపైన వచ్చిన ఎడిటోరియల్స్ సైతం జత చేసారు. ఇలా..ఆరు నెలల కాలంలోనే జగన్ ఏ రకంగా విపల సీఎం అయ్యరనే అంశాన్ని ప్రచారం చేస్తూ...ఈ ప్రచారాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
పీపుల్స్ కేపిటల్ అమరావతి..
#PeoplesCapitalAmaravati అంటూ హాష్ టాగ్ తో మరో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో చంద్రబాబు రాజధాని పర్యటన పైన ప్రధానంగా ప్రస్తావిస్తూ..ఆరు నెలల కాలంలో రాజధాని పరిస్థితిని పోల్చుతూ ఎక్కువగా పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి. అమరావతి ని చంపద్దు..అమరావతిని నిర్మించండి అంటూ అనేక స్లోగన్లు పోస్ట్ అయ్యాయి. జగన్ పూర్తిగా ఏపీ రాజధానిని నిర్లక్ష్యం చేస్తున్నారు.. అమరావతిని బతికించుకోవాలనే పిలుపులు ఉన్నాయి.
అయిదు కోట్ల ప్రజల కల..ప్రపంచ బ్యాంకు రుణ తిరస్కరణ వంటి అంశాలతో పాటుగా అనేక అంశాలను అందులో పలు మీడియా సంస్థలకు.. అదే విధంగా జాతీయ ప్రముఖులకు టాగ్ చేసారు. దీని ద్వారా ఏపీ రాజధాని విషయంలో జగన్ శైలిని ఎండగట్టటమే లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రజా రాజధానికి మద్దతుగా నిలవండీ అంటూ..# థాంక్యూ సీబీఎన్, # chalo Amaravati,#Jagan FailedCM అంటూ టాగ్ చేస్తూ ఈ క్యాంపెయిన్ కొనసాగుతోంది.
వైపీపీ..ప్రభుత్వంలో కీలక చర్చ..
ఈ రకంగా జగన్ లక్ష్యంగా ఒక క్యాంపెయిన్ తరహాలో సాగుతున్న ఈ సోషల్ మీడియా ప్రచారం పైన అటు వైసీపీలోనూ..ఇటు ప్రభుత్వ వర్గాల్లో నూ పెద్ద ఎత్తన చర్చ సాగుతోంది. మంత్రి హోదాలో ఉండి.. బొత్సా అమరావతి పైన చేసిన వ్యాఖ్యలు..శ్మశానం అంటూ చేసిన కామెంట్లు పైన సోషల్ మీడియాలో టీడీపీ తో సహా పార్టీ అభిమానులు..అనుబంధ సంఘాలు చర్చకు తెర లేపాయి.
చంద్రబాబు అమరావతి లో పర్యటన సమయంలో ఈ సోషల్ మీడియా ను వేదికను చేసుకొని జాతీయ..అంతర్జాతీయ స్థాయిలో జగన్ పైన వ్యతిరేకంగా సాగుతున్న ఈ ప్రచారం పైన వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే, ఎన్నికల సమయంలో ఇదే తరహాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని సద్వినియోగం చేసుకున్న వైసీపీ..ఇప్పుడు ముఖ్యమంత్రి లక్ష్యంగా సాగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టే విషయంలో వెనుకబడి ఉందనే చర్చ అంతర్గతంగా పార్టీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు.