బీసీల గురించి మీరా మాట్లాడేది .. మీ జన్మలో బీసీలను రాజ్యసభకు పంపించారా : ఏపీ డిప్యూటీ సీఎం
టిడిపి నేతలను అక్రమ అరెస్టులు చేశారని, బీసీలపై ఉన్న అక్కసును ప్రదర్శిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్న టిడిపి నాయకులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. బీసీల గురించి మీరా మాట్లాడేది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాసనమండలిలో అచ్చెన్నాయుడు అరెస్ట్ పై టిడిపి ఎమ్మెల్సీ జగదీశ్వర రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కావాలని టిడిపి నేతను అరెస్ట్ చేశామని, బీసీలు అంటే ప్రభుత్వానికి చిన్నచూపు అని చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడినట్లుగా తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సొమ్మును దొంగతనం చేశాడు కాబట్టే ఆయన జైలుకు వెళ్ళాడు అని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
ఇక అంతే కాదు మాటిమాటికి బిసి కార్డును వాడుతున్న టిడిపి నేతలను ఆయన తూర్పార పెట్టాడు. పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడైనా మీ జన్మలో బీసీలను రాజ్యసభకు పంపించారా అంటూ ఆయన మండిపడ్డారు . ఇక అంతే కాదు టిడిపి పాలనలో ఏనాడైనా బీసీల కోసం బడ్జెట్ పెట్టారా అంటూ ఆయన టిడిపి నేతలను నిలదీశారు. బీసీల గురించి మాట్లాడే హక్కు టిడిపి నేతలకు లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. తప్పుచేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చి చెప్పారు.