మతమే ఇప్పుడు టీడీపీ అస్త్రం: వైసీపీని ఒంటరి చేయలి..హస్తినలో బాబుపై ఇలా..!
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ పై టీడీపీ కత్తులు దూస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఇటు సోషల్ మీడియాలోను అటు ఎలక్ట్రానిక్ మీడియాలోను తెలుగుదేశం నాయకులు చాలా యాక్టివ్రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జగన్ మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారంటూ కొత్త వాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది టీడీపీ. ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతుండటం కూడా ఇందులో భాగమే అంటూ కొందరు టీడీపీ నాయకులు బాహాటంగానే వ్యాఖ్యానించడం విశేషం. ఇక దీనికి మరింత ఆజ్యం పోసేందుకు హిందూత్వ అజెండాతో టీడీపీ బీజేపీ పంచన చేరుతోందని ఓ జాతీయ పత్రిక కథనం రాసుకొచ్చింది. తద్వారా జగన్ను టార్గెట్ చేయాలని భావిస్తున్నట్లు ఈ కథనంలో పేర్కొంది.
బీజేపీకి దగ్గరవ్వాలనే టీడీపీ ప్రయత్నం
బీజేపీకి గుడ్ బై చెప్పిన ఏడాదిన్నరకు మళ్లీ టీడీపీ దగ్గరవ్వాలని చూస్తోందా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. జగన్ టార్గెట్గా హిందూత్వ అజెండాతో బీజేపీకి దగ్గరవ్వాలనే ప్రయత్నం టీడీపీ చేస్తోందని ఓ జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఇప్పటి వరకు సెక్యులర్ పార్టీగా ముద్రవేసుకున్న టీడీపీ మెల్లగా స్వరం మారుస్తూ హిందూత్వ అజెండాను తీసుకుంటోందని జాతీయ పత్రిక కథనంలో పేర్కొంది. స్వతహాగా క్రైస్తవుడైన ఏపీ సీఎం వైయస్ జగన్ హిందువులకు వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు టీడీపీ యోచిస్తోందంటూ ఆ పత్రిక కథనం ప్రచురించింది.
ఆ విషయంలో బీజేపీ కంటే టీడీపీనే ఎక్కువ ప్రచారం చేస్తోంది
ఆంధ్రప్రదేశ్లో హిందూ అజెండాను బీజేపీకంటే టీడీపీనే ఎక్కువగా ప్రస్తావిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా టీడీపీ హిందూత్వ రాజకీయాలు చేయలేదని చెబుతున్న అనలిస్టులు.. ఈ సారి మాత్రం అదే అజెండాగా బీజేపీతో దగ్గరయ్యేందుకు సైకిల్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా జగన్ను ఈజీగా టార్గెట్ చేయొచ్చనే భావనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు. ఇందుకోసం పలు అంశాలను అస్త్రాలుగా మలుచుకుంది టీడీపీ.
హిందూత్వ అంశాలే అస్త్రాలుగా..
తిరుపతి లడ్డూ ధరలను పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదన దగ్గర నుంచి ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లుగా జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వలేదనే అంశాలను ప్రస్తావిస్తోంది టీడీపీ. అదే సమయంలో గుంటూరులో ఓ ఆలయం కూల్చివేత దగ్గర నుంచి తాజాగా ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతున్నట్లు జగన్ సర్కార్ చేసిన ప్రకటన లాంటి అంశాలను అస్త్రాలుగా మలుచుకుని రాష్ట్రంలో క్రైస్తవ మతాన్ని జగన్ ప్రభుత్వం వ్యాపింపచేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తున్న విషయాలను జాతీయ పత్రిక కథనంలో రాసుకొచ్చింది. ఇక రాష్ట్రంలో మతమార్పిడులు జరుగుతున్నాయనే అంశంపైనే టీడీపీ సోషల్ మీడియా ప్రధానంగా ఫోకస్ చేస్తోందంటూ కథనం ప్రచురించింది జాతీయ పత్రిక.
ఎల్వీ సుబ్రహ్మణ్యంను అందుకే తొలగించారు: కళా వెంకట్రావ్
ఇక తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనంకు సీఎం హోదాలో వెళుతున్న జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావ్ ఆదివారం ప్రశ్నించారు. ఇదే అంశాన్ని టీడీపీ గట్టిగా పట్టుకుంది. ఇతర మతస్తులు తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనంకు వెళ్లినప్పుడు తప్పకుండా డిక్లరేషన్ ఇవ్వాలని ఓ ప్రకటన విడుదల చేశారు కళావెంకట్రావ్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబం క్రైస్తవత్వాన్ని పాటిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే అని తనతో పాటు దర్శనంకు భార్యను కూడా జగన్ తీసుకురారని కళావెంకట్రావ్ అన్నారు. అంతేకాదు టీటీడీలో పనిచేస్తున్న హిందూయేతర వ్యక్తులపై విచారణ జరిపిస్తామన్నందుకే ఎల్వీ సుబ్రహ్మణ్యంను చీఫ్ సెక్రటరీగా తొలగించారని కళావెంకట్రావ్ అన్నారు.
క్రైస్తవులకు జెరుసలేం .. ముస్లింలకు హజ్ యాత్రకు ఆర్థికసాయం
ఇక జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ టీడీపీలు మతపరంగానే విమర్శలు చేస్తూ వస్తున్నాయని జాతీయ పత్రిక తన కథనంలో ప్రచురించింది. ఆగష్టు నెలలో పాస్టర్లకు రూ.5వేలు గౌరవ వేతనం ఇవ్వడంపై విమర్శలు గుప్పించిన విషయాన్ని ఆ పత్రిక గుర్తుచేసింది. అంతేకాదు జెరుసలేం పర్యటనకు వెళ్లే అర్హులైన పేద క్రైస్తవులకు రూ. 60వేలు ప్రభుత్వం ఆర్థికసహాయం చేస్తుందని ఈ వారంలో ప్రకటించడాన్ని కూడా టీడీపీ నేతలు ఆయుధంగా మలుచుకున్నారని ఆ జాతీయ పత్రిక కథనం రాసుకొచ్చింది. అయితే ఇదే ఆర్థిక సహాయం హజ్ యాత్రికులకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించిందన్న విషయాన్ని పక్కనపెట్టి కేవలం క్రైస్తవుల ప్రస్తావనే టీడీపీ తీసుకొస్తోందని జాతీయ పత్రిక కథనంలో ప్రచురించింది.
ఆంగ్లో ఇండియన్ టీచర్స్ ద్వారా మత ప్రచారం అంటూ పోస్టులు
ఓవైపు బీజేపీ మోడీ చేసిన అభివృద్ధి పనులను ట్వీట్ చేస్తుంటే.. టీడీపీ మాత్రం నెల్లూరులోని ఓ ఆలయంకు వైసీపీ పార్టీ రంగులు వేసిన ఫోటోలను ట్వీట్ చేస్తోందని, తిరుపతి ఆలయంపై, జగన్ మతంపై, తిరుపతిలో సీఎం డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై ట్వీట్ చేస్తోందంటూ జాతీయపత్రిక తన కథనంలో ప్రచురించింది. ఇక సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ నేతలు, అధికార ప్రతినిధులు వాట్సాప్ ద్వారా మెసేజ్లను పోస్టు చేస్తున్నారని జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. మిషన్ - క్రిస్టియన్ ఏపీ అనే పోస్టును వైరల్ చేస్తున్నారంటూ కథనంలో ప్రచురించింది. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం ద్వారా ఆంగ్లో ఇండియన్ టీచర్స్ను తీసుకొచ్చి వారిద్వారా మతప్రచారంకు తెరతీసే యోచనలో సీఎం జగన్ ఉన్నారంటూ టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని జాతీయ పత్రిక కథనంలో రాసుకొచ్చింది.
చంద్రబాబు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు: అంబటి రాంబాబు
ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్కు క్రైస్తవుల మద్దతు, దళితుల మద్దతు ఉందని అది ఓర్వలేకనే టీడీపీ ఆయనపై విష ప్రచారం చేస్తోందని వైసీపీ మండిపడింది. జగన్ సీఎం కాకముందు తిరుమలకు వెళ్లారని గుర్తుచేసిన వైసీపీ నేతలు.. టీడీపీ అప్పటి నుంచే విషప్రచారానికి దిగిందని పేర్కొంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇంగ్లీషు మీడియంను క్రైస్తవత్వానికి ముడిపెట్టడం అత్యంత హేయమైన చర్య అని వైసీపీ మండిపడింది. ఇక జగన్ను కార్నర్ చేసేందుకు ఎలాంటి అంశం లేకపోవడంతో చివరకు మతపరమైన అంశాలతో టార్గెట్ చేసేందుకు టీడీపీ పూనుకోవడం హేయమైన చర్యగా వైసీపీ అభివర్ణించింది. చంద్రబాబు నాయుడు ఎన్ని జిత్తులమారి అంశాలను తీసుకొచ్చినా.. ఏపీ సీఎం జగన్ అన్ని మతాలను గౌరవిస్తారని, వాటి ప్రయోజనాలను కాపాడుతారనే విషయం ప్రజలకు తెలుసునని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు.