టీడీపీ టార్గెట్ మినిస్టర్ సురేష్ ... ఆయనను క్వారంటైన్ కు పంపండి
వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ హైదరాబాద్ వెళ్ళి రావటం, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించటం పై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు . ఇప్పటికే ప్రజలకు ఒక రూల్ వైసీపీ నేతలకు ఒక రూలా అని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు మంత్రి ఆదిమూలపు సురేష్ ను కూడా క్వారంటైన్ కు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్ను క్వారంటైన్లో ఎందుకు ఉంచలేదని ప్రశ్నించారు.
మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ నేపధ్యంలో ఆంక్షలు విధించడం మంచిదేనని అయితే అవి ప్రజలకే పరిమితం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక లాక్ డౌన్ ఆంక్షలు వైసీపీ నాయకులు పాటించడం లేదని విమర్శించారు. తూర్పుగోదావరికి చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి వచ్చినా వారిని క్వారంటైన్ కు తరలించలేదని పేర్కొన్నారు.
ప్రజలకొకన్యాయం, వైసీపీ నేతలకొకన్యాయమా? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. సామాన్య ప్రజలైతే నిర్దాక్షిణ్యంగా క్వారంటైన్ కు పంపిస్తున్నారని , 9 నెలల గర్భిణిని 14 రోజులు క్వారంటైన్లో ఉంచారన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్ ఆంక్షలు పాటించడంలేదు గానీ, చంద్రబాబుకు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ను క్వారంటైన్ కు పంపాలని డిమాండ్ చేశారు . ఇక కరోనా జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని బుద్దా వెంకన్న సూచించారు