ఎన్నికల ప్రచారంలో యువత టార్గెట్ గా టీడీపీ అస్త్రాలు .. గెలిస్తే ప్రతి ఆరు నెలలకు జాబ్ మేళాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. మార్చి 10వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది.
టీడీపీ చీఫ్ చంద్రబాబు రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కీలకంగా పనిచేస్తున్నారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు పెంచిన టీడీపీ ...ప్రచార బరిలోకి చంద్రబాబు
యువతను లక్ష్యంగా చేసుకున్న టిడిపి.. హామీ ఇదే
ముఖ్యంగా ఈ ఎన్నికల్లో యువతను లక్ష్యంగా చేసుకున్న టిడిపి నేతలు పురపాలిక ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు పెడతామని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఆస్తిపన్నుల పాత బకాయిలను రద్దు చేసి, ప్రస్తుతం స్లాబ్ లో కూడా సగమే విధిస్తామని, మూతబడిన అన్న క్యాంటీన్ లను పునః ప్రారంభిస్తామని, పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు.
ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్ళే పనిలో టీడీపీ నేతలు
అంతేకాదు పట్టణ సుందరీకరణ, గతుకులు లేని రోడ్లు, ప్రతి వీధిలో పార్కులు , ఓపెన్ జిమ్ లు , ఎల్ఈడీ లైట్లు, ఆటో డ్రైవర్ లకు టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం, ప్రతి ఇంటికీ ఉచిత మంచి నీటి కనెక్షన్ , పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంపు , టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టుల పూర్తి, మెప్మా బజార్ లు , సున్నా వడ్డీ రుణాలు ఇలా అనేక హామీలు ఇచ్చిన టిడిపి నేతలు ఈ హామీలను ప్రజల్లోకి పెద్దఎత్తున తీసుకు వెళ్తున్నారు .
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఉద్యోగాల కల్పనలో వైసీపీ విఫలమవుతోందని, పురపాలక ఎన్నికల్లో గెలిస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా లు పెడతామని ప్రకటించారు.
అధికార పార్టీ లోపాలను ఎత్తి చూపటంతో పాటు మ్యానిఫెస్టో ప్రచారం
అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ను ప్రతిపక్ష పార్టీల నాయకుల పై విమర్శలు గుప్పిస్తున్నారు . ముఖ్యంగా విశాఖలో ప్రచారం చేస్తున్న విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేస్తూ అనిత ఎన్నికల ప్రచారం సాగుతోంది.
ఈసారి ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిడిపి ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ అదే సమయంలో తాను చేయదలచుకున్నది చెబుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తానికి హోరా హోరీ గా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో టిడిపి తన ప్రచార అస్త్రాలతో దూసుకుపోతుంది.
దూకుడుగా ఎన్నికల ప్రచారం .. ఓటరు తీర్పు ఎటో ?
వైసిపి అవినీతిని ఎండగడుతూ, అక్రమాలను చెబుతూ, తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తుంది. ముఖ్యంగా విజయవాడ , విశాఖ, గుంటూరు కార్పొరేషన్లపై పట్టు కోసం అధికార వైసీపీ , ప్రతిపక్ష టీడీపీ తెగ ప్రయత్నం చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఈసారి టిడిపి అభ్యర్థులకు ఏ మేరకు పట్టం కడతారో తెలియాల్సి ఉంది.