స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యల దుమారం ... దారుణం, క్షమాపణ చెప్పాలని స్పీకర్ ను టార్గెట్ చేసిన టీడీపీ
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీతో పాటు, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులపై వ్యాఖ్యలు చేసినట్లుగా న్యాయవ్యవస్థపై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి నాయకులు మండిపడుతున్నారు. తాజాగా తమ్మినేని సీతారాం న్యాయవ్యవస్థ మీద, శాసన మండలిలో టీడీపీ తీరుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.
జగన్ రెడ్డి సైకోలా ప్రవర్తిస్తున్నారు ..బీసీ నేత అచ్చెన్నాయుడుపై వివక్ష : లోకేష్,యనమల ఫైర్
స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలపై మొదలైన రచ్చ
రాష్ట్రాన్ని కోర్టులు పరిపాలిస్తున్నాయని, సీఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు అంటూ న్యాయవ్యవస్థనే ప్రశ్నించేలా తిరుపతిలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద రచ్చ మొదలైంది .ద్రవ్య వినిమయ బిల్లును టిడిపి నేతలు అడ్డుకున్నారని శాసనమండలి అంశాన్ని ప్రస్తావించిన ఆయన తీరుపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులపై తమ్మినేని చేసిన వ్యాఖ్యలు దారుణం అంటూ మండిపడ్డారు.
తమ్మినేని వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి
న్యాయవ్యవస్థపై వ్యాఖ్యానించినందుకు స్పీకర్ తమ్మినేని క్షమాపణ చెప్పాలని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు . తన వ్యాఖ్యలు తాను వ్యక్తిగతంగా చెప్పినవా? లేక ప్రభుత్వం తరపున చేసిన వ్యాఖ్యలా ? లేక శాసన సభ తరపున చేసిన వ్యాఖ్యలా ? అనేది తమ్మినేని సీతారాం వివరణ ఇవ్వాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తమ్మినేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
స్పీకర్ గా హోదా మరచి గౌరవాన్ని తగ్గించకండి
శాసనమండలిలో చోటుచేసుకున్న ఘటనలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీలు. ఆయనకు రాజకీయాలు చేయాలని బాగా ఆసక్తిగా ఉంటే స్పీకర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలు చేయవచ్చని టీడీపీ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దాని గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడటం సరికాదని వారు మండిపడ్డారు. న్యాయవ్యవస్థపై స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, గౌనివారి శ్రీనివాసులు పేర్కొన్నారు.
స్పీకర్ స్థాయిలో అసత్యాలా ?
శాసనమండలిలో టిడిపి ద్రవ్య వినిమయ బిల్లు అడ్డుకున్నది అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. మండలిలో టిడిపి సభ్యులు 30 సార్లు ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని కోరారని ఆ విషయంలో క్లారిటీ ఉందని, రికార్డుల్లో కూడా ఆ అంశం ఉందని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ స్థానంలో అసత్యాలు చెప్పడం సరికాదని మండిపడ్డారు.
ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా తమ్మినేని వ్యాఖ్యలు
రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి,స్పీకర్ గా తమ్మినేని సీతారాం అటు న్యాయ వ్యవస్థ పైన, ఇటు శాసనమండలి పైన, ఇటీవల సమావేశాలలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించక పోవడం పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం గా మారాయి. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకుంటున్న ఎన్నో నిర్ణయాలను కోర్టులు కొట్టి వేశాయి. సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి ఊరట దక్కడం లేదు. ఈ కోపంతోనే రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న తమ్మినేని న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు . ఇది ప్రభుత్వానికి మంచిది కాదని చెప్తున్నారు .