కోడెల వ్యవహారంపై టీడీపీ మౌనం..!ప్రస్తుత పరిస్థితిలో దూరంగా ఉండడమే బెటర్ అంటున్న నేతలు..!!
అమరావతి/హైదరాబాద్ : 'కే టాక్స్' వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు, కుమార్తెపై వస్తున్న ఫిర్యాదులపై నోరు మెదపకూడదని టీడీపీ నిర్ణయించినట్లు తెలిసింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెలను వెనకేసుకుని వస్తే ఉన్న పరువు కూడా పోతుందని ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉంటే మంచిదని పలువురు పార్టీ సీనియర్ నేతలు సూచించడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. విదేశాల్లో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబుతో కోడెల ఫోన్ ద్వారా సంప్రదించి, తన కుటుంబంపై నమోదవుతున్న కేసుల గురించి చెప్పాలనే ప్రయత్నం చేసిసట్టు తెలుస్తోంది. ఐతే చంద్రబాబు కోడెల శివప్రాసాదరావుకి అందుబాటులోకి రాలేదని సమాచారం.
మరో వివాదంలో కోడెల తనయుడు..! స్టేషన్లో ఫిర్యాదు..!!
అధికారంలో ఉన్న సమయంలో తమ నుంచి డబ్బులు వసూలు చేశారని అనేక మంది బాధితులు కోడెలతో పాటు ఆయన కుమారుడు, కుమార్తెపై వరుసగా ఫిర్యాదులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవన్నీ రాజకీయ వేధింపుల్లో భాగంగానే వస్తున్నాయని ఒక ప్రతినిధి బృందం డీజీపీకి ఫిర్యాదు చేయాలని రెండురోజుల క్రితం జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయించారు. అదే బృందం డీజీపీని కలవాలని నిర్ణయించినా టీడీపీ నాయకులెవరూ వెళ్లలేదు. ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో పలువురు నాయకులు కోడెల వైఖరిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చంద్రబాబు మిన్నకుండిపోయినట్లు సమాచారం.
కోడెలను వెనకేసుకొస్తే పరువు పోతుందన్న సీనియర్లు..! దూరంగా ఉండాలని సూచన.. !!
కోడెల కుటుంబీకులపై ఎప్పటి నుంచో తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, చాలామంది ఆయన, ఆయన కుమారుడు, కుమార్తె అవినీతి వ్యవహారాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని టీడీపీ ఉప నేత బుచ్చయ్యచౌదరి ఆ సమావేశంలో మండిపడినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పార్టీ తలదూర్చితే ఆయన అవినీతి వ్యవహారాలను సమర్థించినట్లవుతుందని, మౌనంగా ఉంటే మంచిదని, లేకపోతే ఉన్న పరువు కూడా పోతుందని చెప్పడంతో చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. అందుకే కోడెలను సమర్థిస్తూ ఏ ఒక్క టీడీపీ నాయకుడు మాట్లాడేందుకు ముందుకు రావడంలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
స్టార్ ప్రసారాల చౌర్యానికి పాల్పడుతూ పట్టుబడిన వైనం..! కే చానల్ పైరసీ..!!
సాంకేతిక ఫైరసీకు పాల్పడుతున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ బండారం మరోమారు బట్టబయలైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత కొన్నేళ్లుగా కోడెల శివరాం గౌతం కమ్యూనికేషన్ పేరిట కే చానల్ నిర్వహిస్తూ అక్రమ ఫైరసీకి పాల్పడుతున్నాడు. స్టార్ టీవీ ప్రసారాలకు సంబంధించి డీటీహెచ్ ద్వారా సాంకేతిక చోరీకి పాల్పడి ప్రతి నెలా లక్షల రూపాయలు అక్రమార్జన చేస్తున్నాడు. దీనిపై స్టార్ టీవీ ప్రతినిధులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం అడ్వొకేట్ కమిషన్ను ఏర్పాటు చేసింది.
సీఐకి ఫిర్యాదు చేస్తున్న స్టార్ టీవీ ప్రతినిధులు..! విచారిస్తామన్న పోలీసులు..!!
కమిషన్ సభ్యుల బృందం ఈ ఏడాది ఏప్రియల్ 18న రాజాగారి కోటలోని మాజీ స్పీకర్ కోడెల నివాస గృహంలో నిర్వహిస్తున్న కే చానల్ సంస్థ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. అక్కడ సాంకేతిక పరంగా ప్రసారాలు చౌర్యం చేస్తున్నట్లు గుర్తించి డీకోడర్, ఎన్కోడర్లను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. న్యాయస్థానం కోడెల శివరాంకు సమన్లు జారీ చేసినా స్పందించలేదు. దీంతో కమిషన్ న్యాయవాది లక్ష్యవీర్ ముని మంగళవారం కే చానల్ కార్యాలయానికి వెళ్లి సమన్లు తీసుకోవాల్సిందిగా కోరగా సిబ్బంది నిరాకరించారు. కోర్టు ధిక్కారణ కింద న్యాయస్థానానికి నివేదిక అందించనున్నట్లు ఆయన తెలిపారు. శివరామ్పై చర్యలు తీసుకోవాలని స్టార్ ప్రతినిధులు సీఐని కోరారు.