టీడీపీ, టీఆర్ఎస్: ప్రధాని ఎవరనేది నిర్ధారిస్తారట: మెజారిటీ స్థానాలు ఇచ్చినా ఆదమరుపు..!
అమరావతి: ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ఓ విచిత్రమైన నినాదాన్ని అందుకుంది. ఎన్నికలకు ఆరు నెలల ముందునుంచీ దీన్ని జనంలోకి తీసుకెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది గానీ..ఓటర్లు పెద్దగా చెవికెక్కించుకున్నట్లు కనిపించట్లేదు. అదే- ప్రధానమంత్రి ఎవరనేది తాము డిసైడ్ చేస్తాం అనే నినాదం. అత్యధిక లోక్ సభ సీట్లను గెలిపిస్తే.. ప్రధానిగా ఎవరు ఉండాలనేది తామే నిర్ణయిస్తామని, కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతి ఎన్నికల సభలోనూ చెబుతున్నారు.
ఏపీ ఒక్కటే అనుకుంటే- పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఇదే పాట పాడుతోంది అక్కడ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి. తమకు అత్యధిక లోక్ సభ సీట్లను కేటాయిస్తే.. ప్రధానిగా ఎవరు ఉండాలనేది తాము నిర్ణయిస్తామని, దీనివల్ల రాష్ట్రానికి భారీగా నిధులను తెప్పించుకోవచ్చని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ చెబుతున్నారు.
ఓట్ల కోసం గాలం?
`ప్రధానిగా ఎవరు ఉండాలనేది తాము నిర్ణయిస్తాం..`అనే మాట ఫక్తు ఎన్నికల వ్యూహం అనడంలో సందేహాలు అక్కర్లేదు. మెజారిటీ లోక్ సభ స్థానాలను కొల్లగొట్టేడానికి ఏపీలో తెలుగుదేశం, తెలంగాణలో టీఆర్ఎస్ రూపొందించిన ఎన్నికల వ్యూహంలో ఓ భాగం. ఎన్నికలు పూర్తయ్యాక తెప్ప తగలేయరనే గ్యారంటీ లేని మాటలు అవి. దేశవ్యాప్తంగా- 543 లోక్ సభ స్థానాలు ఉండగా.. వాటిల్లో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీ ప్రధాని పదవిని అందుకుంటుంది. హంగ్ అంటూ ఏర్పడితే- అత్యధిక లోక్ సభ స్థానాలను గెలుచుకున్న ప్రాంతీయ పార్టీలు మాత్రమే చక్రం తిప్పగలుగుతాయి. ఏపీలో 25, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి.
ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బిహార్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ఉన్న లోక్ సభ స్థానాల సంఖ్యకు ఇవి దరిదాపుల్లో కూడా లేవు, రాలేవు కూడా. ఉత్తర్ ప్రదేశ్ -80, పశ్చిమ బెంగాల్ - 42, బిహార్- 40, తమిళనాడు - 39 లోక్ సభ సీట్లు ఉన్నాయి. హంగ్ అంటూ ఏర్పడితే.. ఆయా రాష్ట్రాల్లో అత్యధిక సీట్లను తమ ఖాతాలో వేసుకున్న పార్టీలు ప్రధానమంత్రి ఎవరనే విషయాన్ని నిర్ధారయిస్తాయే తప్ప, ఏపీ, తెలంగాణ కాదు. హంగ్ ఏర్పడినప్పుడు ఒక్క సీటు కూడా కీలకమే అవుతుంది. అలాంటప్పుడు అధిక సీట్లను సాధించుకున్న పార్టీలు డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ప్రధానిని నిర్ధారించడం అంత తేలికా?
చిన్న రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఓ కూటమిగా ఏర్పడగలిగితే ప్రధానమంత్రి ఎవరనే విషయాన్ని నిర్ధారించడానికి అవకాశం ఉంది. ఈ కూటమి కూడా ఏదైనా జాతీయ పార్టీ అండ చూసుకోవాల్సి రావడం తప్పనిసరి. జాతీయ పార్టీ అండతో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రతిపాదించగలిగినా.. సదరు ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు. గతంలో చంద్రశేఖర్, దేవేగౌడ, ఐకే గుజ్రాల్ వంటి నాయకులు ఈ రూపంలో ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన వారే. వారి పరిపాలనా తీరు ఎలా ఉందనేది తెలిసిన విషయమే.
వామ్మో..! ఎన్నికల్లో ఇన్ని జిమ్మిక్కులా..! ఒకే పేరుతో ఇంత మంది నామినేషన్లా..? దేవుడా..!!
మెజారిటీ సీట్లు టీడీపీ కట్టబెట్టినా
ఏపీ, తెలంగాణల్లో 2014 నాటి ఎన్నికల్లో ప్రజలు టీడీపీ, టీఆర్ఎస్ లకు అత్యధిక లోక్ సభ సీట్లను కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఏపీలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. 16 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల అనంతరం ప్రతిపక్షానికి చెందిన మరో ఇద్దర్నీ తమ వైపు లాక్కో గలిగింది టీడీపీ. బీజేపీతో పొత్తు పెట్టుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎవరూ పన్నెత్తు మాట అనకుండా, ఈగ వాలనీయకుండా చూసుకున్నారు చంద్రబాబు. పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారడంతో.. ముందు చూపుతో వ్యవహరించారు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి, యూపీఏ కూటమిలో చేరిపోయారు. మహా కూటమి పేరుతో కాంగ్రెస్ పంచన చేరారు.
నల్ల చొక్కా వేసుకోవడం వెనుక ఆంతర్యం..
16 లోక్ సభ స్థానాలను టీడీపీకి కట్టబెట్టినా, కేంద్రంలో అధికారంలో ఉన్నా సాధించిందేమైనా ఉందా అని ప్రశ్నిస్తే.. వచ్చే సమాధానం శూన్యమనే. నాలుగేళ్ల విలువైన కాలాన్ని వ్యర్తం చేశారు చంద్రబాబు . ఎన్నికల సంవత్సరంలో ప్రవేశించిన తరువాత.. నల్ల చొక్కా వేసుకుని నిరసన తెలుపుతున్నారు. దీని అర్థం- తన వల్ల ఏదీ సాధ్యం కాలేదనే కదా? రాష్ట్రానికి తాను ఏ మేలూ చేయలేక చేతులెత్తేశాననే కదా? ఇప్పుడు మరోసారి 25 ఎంపీలను గంపగుత్తగా టీడీపీకి అందించడం వల్ల ఫలితాల్లో మార్పులు ఉంటాయా? అసలు టీడీపీని విశ్వసించవచ్చా? అనే సందేహాలు ఓటర్లలో వ్యక్తమౌతున్నాయి. 25 లోక్ సభ సీట్లు అందిస్తేనే.. రాష్ట్రానికి మేలు చేయగలరా? లెక్క తగ్గితే.. పట్టించుకోరా? అనే చర్చ నడుస్తోంది.
రాష్ట్రానిక ప్రాణవాయువుగా భావించే ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వైఖరి ఏమిటనేది ఇప్పటికే స్పష్టమైంది. నాలుగేళ్ల పాటు హోదా మాట ఎత్తకుండా ప్యాకేజీ వెంట పడుతూ, కాలక్షేపం చేశారు. పోనీ ప్యాకేజీ అయినా సాధించారా? అంటే అదీ లేదు. తీరిగ్గా ఎన్నికలు దగ్గరకొచ్చే సరికి, ప్రత్యేక హోదా అనే డిమాండ్ ప్రజల్లో సజీవంగా ఉండే సరికి.. యూటర్న్ తీసుకున్నారు చంద్రబాబు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన హోదా ఉద్యమాలను చంద్రబాబు హైజాక్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
కేంద్రంలో కీలకం కాదు.. కదా ఊసులోనే లేని టీఆర్ఎస్
తెలంగాణలోనూ దాదాపు ఇదే రాజకీయ పరిస్థితి నెలకొంది. అక్కడున్న 17 లోక్ సభ స్థానాలకు 16 సీట్లను తమకు కేటాయిస్తే.. ప్రధాని ఎవరనేది తాము నిర్ధారిస్తామని అంటూ కేటీఆర్. 16 ప్లస్ 116 అంచనాతో ఉన్నారాయన. 16 లోక్ సభ స్థానాలు 116 అసెంబ్లీ సీట్లు అని లెక్కలేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన లోక్ సభ సీట్లు సంఖ్య 14. మిత్రపక్షం మజ్లిస్ ను కూడా కలుపుకొంటే 15 స్థానాలు అవుతాయి. బండారు దత్తాత్రేయ (సికింద్రాబాద్), నంది ఎల్లయ్య (నాగర్ కర్నూలు) వదిలేస్తే.. మజ్లిస్ ను కూడా కలుపుకొని మొత్తం 15 చోట్ల జయకేతనం ఎగురవేసింది టీఆర్ఎస్. రెండు తక్కువ 17 సీట్లను పువ్వుల్లో పెట్టి మరీ అప్పగించినప్పటికీ.. టీఆర్ఎస్ కేంద్రంలో కీలక పాత్ర పోషించలేకపోయింది. అసలు ఊసులోనే లేకుండా పోయింది. దీనికి కారణం- బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండటమే. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రావడంతో అన్ని స్థానాలనూ తమకే కట్టబెట్టాలని టీడీపీ, టీఆర్ఎస్ కోరుతున్నాయి. మొత్తం సీట్లను ఇచ్చేయడం వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదనే విషయం ఓ సారి స్పష్టమైన తరువాత కూడా.. ఓటర్లు తాము చెప్పిందే నమ్ముతారని, తమనే విశ్వసిస్తారని ఈ రెండుపార్టీలు భావించడం భ్రమే అవుతుంది.