నంద్యాల సవాల్: టీడీపీ వ్యూహం ఇదీ?, ఎన్నికల కమిషన్ షాక్
ఈ ఏడాది జనవరి 1వ తేదీ వరకు నమోదు చేసుకున్నవారు మాత్రమే ఓటు వేయడానికి అర్హులని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇది తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చే విషయమేనని అంటున్నారు.
అమరావతి/ కర్నూల్: 2014 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జంట ఓట్లు వేసినా నాడు అధికార యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ఈ విషయాన్ని తర్వాత 'ఆధార్' నంబర్లతో ఓటర్ల పేర్లు తనిఖీ చేయడంతో హైదరాబాద్ నగరంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్ర ప్రాంత నియోజకవర్గాల్లో రెండుసార్లు ఓటేసినట్లు నిర్ధారణ అయింది.
కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాతకాలే మారిపోయాయి. ఇదే తంత్రాన్ని వచ్చేనెల 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ అదే వ్యూహం అమలు చేయబోతున్నదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఏడాది జనవరి 1వ తేదీ వరకు నమోదు చేసుకున్నవారు మాత్రమే ఓటు వేయడానికి అర్హులని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇది తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చే విషయమేనని అంటున్నారు. నంద్యాల నియోజకవర్గంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ 15 వేల మంది కొత్త ఓటర్లను చేర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు బోగస్ ఓట్లేనని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఎన్నికల కమిషన్ నిర్ణయం బోగస్ ఓట్లతో విజయం సాధించాలనే తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని దెబ్బ తీసిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు.
పక్క అసెంబ్లీ స్థానాల నుంచి బోగస్ ఓటర్ల నమోదు ఇలా
నంద్యాల అసెంబ్లీ స్థాన ఉప ఎన్నిక ఫలితం దేశవ్యాప్తంగా చర్చ జరగాలని సాక్షాత్ ఏపీ సీఎం చంద్రబాబు సవాల్ చేశారు మరి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలని సంకల్పించింది అధికార టీడీపీ. అందుకోసం తెలుగు తమ్ముళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు విన వస్తున్నాయి. అందుకే పక్క నియోజకవర్గాల ప్రజలతో నంద్యాలలో ఓటర్లుగా పేరు నమోదు చేయించినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. పక్క నియోజకవర్గాల నుంచి ఏకంగా నంద్యాల పరిధిలో 16 వేల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని వారు అంటున్నారు.
ఏకంగా 16 వేల బోగస్ ఓటర్ల పేర్ల నమోదు
నంద్యాల అసెంబ్లీ స్థానం పరిధిలో ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఓటు ఆయుధాన్ని బోగస్ ఓట్లతో దారి మళ్లించే కుయుక్తులకు పాల్పడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. గత జనవరి ఒకటో తేదీన కర్నూలు జిల్లా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించడంతోపాటు నూతనంగా దరఖాస్తులను ఆహ్వానించారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ మొదలయ్యింది. దీంతో అధికార తెలుగుదేశం పార్టీ వేలసంఖ్యలో బోగస్ ఓటర్ల నమోదు చేయించినట్లు ప్రచారం సాగింది. నాలుగు రోజుల క్రితం వరకు సుమారు 11 వేల మేరకు ఉన్న ఈ దరఖాస్తుల సంఖ్య గరువారానికి ఏకంగా 16 వేలకు పెరిగిపోయింది.
భారీస్థాయిలో దరఖాస్తులతో ఆశ్చర్యం
నంద్యాలలో చివరిరోజు ఈ నెల 28వ తేదీ వరకు వేల సంఖ్యలోనే బోగస్ ఓట్లను అధికార పార్టీ చేర్పించినట్టు విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా పక్క అసెంబ్లీ స్థానాల్లోని వారిని కొత్త ఓటర్లుగా చేర్పించినట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఈ నెలాఖరుతో ఈ ప్రక్రియ ముగియనున్నది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానాలకు కలిపి రాని స్థాయిలో కేవలం నంద్యాల నుంచే ఓటర్ల నమోదు ఉండటం అధికారులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జగన్ పార్టీ ఫిర్యాదు..
బోగస్ ఓట్ల నమోదు చేసిన విషయమై ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఫిర్యాదు చేయడం, భారీగా కొత్త ఓటర్లకు దరఖాస్తులు రావడంతో ఎన్నికల సంఘం నిఘా పెట్టినట్లు తెలిసింది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను పక్కన ఉన్న అసెంబ్లీ స్థానాల్లోని ఓటర్ల జాబితాలతో సరిచేసి చూడాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఈ స్థితిలో 2017 జనవరి 1ని కటాఫ్ తేదీగా నిర్ణయించినట్లు చెబుతున్నారు.