చంద్రబాబుకు నో ఇన్విటేషన్, టిడిపి గుర్రు: వెంకయ్యతో బిజీ
హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకు రావడంతో పాటు హైటెక్సిటీ నిర్మాణానికా ఆద్యుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు
హైదరాబాద్/ అమరావతి: హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకు రావడంతో పాటు హైటెక్సిటీ నిర్మాణానికా ఆద్యుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఆహ్వానించకపోవడంపై తెలుగు దేశం పార్టీ హైదరాబాద్ నగరాధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాసరావు మండిపడ్డారు.
తెలుగు ప్రజలు తమకు సమానమని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పే పాలకులు ప్రపంచస్థాయి సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని పిలవకపోవడంతో వారి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని ఆయన అన్నారు. హైదరాబాద్ సదస్సుకు వేదికగా నిలిచిందంటే అది చంద్రబాబు కృషి వల్లేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
Recommended Video
ఇదిలావుంటే, చంద్రబాబు తన రాష్ట్రంలో మంగళవారంనాడు తీరిక లేకుండా గడిపారు. వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) కళాశాల భవనాలను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో కలిసి ఆయన ప్రారంభించారు.
తరగతి గదిలోనే భవిష్యత్తు: వెంకయ్య
దేశరాష్ట్ర భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తరగతి గదిని ఆయన తరగని నిధిగా అభివర్ణించారు. దేవుడు తనకు కనిపించి వరం కోరుకోమంటే బాల్యం తిరిగివ్వాలని కోరుకుంటానని అన్నారు. ఈ దశలో ఎలాంటి కల్మషం ఉండదని, ఇప్పుడే భవిష్యత్కు బాటలు వేసుకోవాలని ఆయన అన్నారు.
గూగుల్ ముఖ్యమే అయినా: వెంకయ్య
వసతులు, వనరులు కల్పించడమే కాదు.. విద్యాబుద్ధులు కూడా అదే స్థాయిలో విట్ అందిస్తుందని వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తంచేశారు. గూగుల్ చాలా ముఖ్యమే అయినప్పటికీ గురువును కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రపంచంలో గొప్ప కంపెనీలకు సీఈవోలుగా దక్షిణ భారతదేశానికి చెందినవారు ఉండడం మనందరికీ గర్వకారణమని అన్నారు.
చంద్రబాబు ముందు చూపుతో: వెంకయ్య
చంద్రబాబు ముందుచూపుతో అమరావతి విజ్ఞాన కేంద్రంగా రూపుద్దికుంటోందని వెంకయ్య చెప్పారు. విద్య, విజ్ఞాన, ఆరోగ్య హబ్గా అమరావతిని తీర్చిదిద్దేందుకు సీఎం ఎనలేని కృషి చేస్తున్నారని, ఆయనకు తన చేయూత తప్పకుండా ఉంటుందని చెప్పారు. రేపు కేంద్రం ఏం చేస్తుందో దాన్ని చంద్రబాబు ఇవాళే గుర్తిస్తారని కితాబిచ్చారు.
సాధారణ పాఠశాలలోనే..
తెలివి ప్రతి ఒక్కరిలో ఉంటుందని, దాన్ని గుర్తించి సానబెడితే మట్టిలోని మాణిక్యాలను వెలికితీయవచ్చునని వెంకయ్యనాయుడు అన్నారు.సాధారణ కుటుంబంలో జన్మించినా అసాధారణ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉండడమే ఈ దేశం గొప్పతనమని అన్నారు. చంద్రబాబు, మోదీ, తాను సాధారణ పాఠశాలలోనే చదువుకొని పైకొచ్చామన్నారు.
హైటెక్ సిటీ ప్రస్తావన తేని కెసిఆర్
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జిఈఎస్) ప్రారంభోపన్యాసంలో హైదరాబాదుకు తరలి వస్తున్న బడా కంపెనీలు పేర్లను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రస్తావించారు. అయితే, సాఫ్ట్వేర్ పరిశ్రమకు నిలయంగా మారిన హైటెక్ సిటీని మాత్రం ప్రస్తావించలేదు. హైటెక్ సిటీని తానే నిర్మించానని చంద్రబాబు పదే పదే చెప్పుకోవడం వల్లనే కెసిఆర్ ఆ పేరును ప్రస్తావించలేదని, దాన్ని ప్రస్తావిస్తే చంద్రబాబు పేరు చెప్పాల్సి వస్తుందని భావించారని అంటున్నారు. (KCR in GES)