ఏవీకి నామినేటెడ్ పోస్ట్: ఇస్తే దేనికైనా రెడీ.. అఖిల సంకేతాలు? అధిష్టానం అసహనం
కర్నూలు: ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీలో విభేదాలు సమసిపోలేదని తెలుస్తోంది. స్వయంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని మంత్రి భూమా అఖిలప్రియ, పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య రాజీ ప్రయత్నం చేసినా వారి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉందని అంటున్నారు. ఇటీవల టీడీపీ సైకిల్ యాత్ర, రాళ్ల దాడి ఘటన అనంతరం చంద్రబాబు అఖిల, ఏవీలను పిలిచి క్లాస్ తీసుకున్నారు.
Recommended Video
చదవండి: ఓటుకు నోటు కేసు, ఇదీ అసలు విషయం!: 'చంద్రబాబును ఎవరూ ఏం చేయలేరు
పార్టీ కోసం కలిసి మెలిసి ముందుకు సాగాలన్నారు. అధినేత చెప్పినా వారి మధ్య మాత్రం అలాగే ఉందని అంటున్నారు. తాజాగా ఓ వాదన వినిపిస్తోంది. ఏవీ సుబ్బారెడ్డికి అధిష్టానం ఏదైనా పదవి ఇవ్వాలనుకుంటోందని, అఖిల మాత్రం దానిని వ్యతిరేకించవచ్చునని పార్టీలోని వారు భావిస్తున్నారట.
చదవండి: 'ఓటుకు నోటు కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదు'
ఏవీ సుబ్బారెడ్డికి నామినేటెడ్ పోస్టు
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయనకు ఏదైనా పదవి ఇస్తానని చెప్పారు. ఇందులో భాగంగా త్వరలో ఏవీకి నామినేటెడ్ పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించి ఆర్డర్ కూడా రావొచ్చని అంటున్నారు.
ఏవీకి పదవి ఇస్తే అఖిల కీలక నిర్ణయం?
ఏవీ సుబ్బారెడ్డికి ఏదైనా పదవి ఇస్తే అఖిలప్రియ దేనికైనా సిద్ధమనే అభిప్రాయంతో ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. తాను ఆళ్లగడ్డలో ఉండగా ఏవీ కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తారని అఖిల ఆగ్రహంతో ఉన్నారు. ఏవీ వ్యవహారాల నేపథ్యంలో అఖిల అధిష్టానంపై కొంత అసంతృప్తితో ఉన్నారట. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వవద్దని ఆమె భావిస్తున్నారట.
కీలక నిర్ణయంపై అనుచరులకు అఖిల సంకేతాలు
ఒకవేళ తన అభిప్రాయానికి భిన్నంగా అధిష్టానం ఏవీ సుబ్బారెడ్డికి పదవి ఇస్తే అఖిలప్రియ కీలక నిర్ణయానికి సిద్ధంగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కొందరు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది. అంతేకాదు, తాను తప్పనిసరి పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటే తన వెంటే ఉండాలని అనుచరులకు, భూమా అభిమానులకు ఆమె వివిధ రూపాల్లో సందేశాలు పంపిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఏవీ సుబ్బారెడ్డి రాజకీయంగా ఎదుగుతామంటే తాము అండగా ఉండామని భూమా నాగమౌనిక రెడ్డి ఇటీవల చెప్పడం గమనార్హం.
అఖిల తీరుపై అసహనం
మరోవైపు, అఖిలప్రియ తీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. ఆమె తీరు అసహనానికి గురి చేస్తోందట. ఆమెకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తోంటే ఇలా చేయడం సరికాదని సీనియర్లు భావిస్తున్నారు. ఓ వైపు జిల్లా, నియోజకవర్గంలో విభేదాలు, మంత్రిగా అంత ఆకట్టుకోవడం లేదనే వాదనలు, రాజకీయంగా పార్టీకి ఎలాంటి ప్లస్ కాకపోవడం, అధినాయకత్వం మాటలు లెక్కపెట్టకపోవడం వంటివి ఆమెకు మైనస్ అయినా పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని, కానీ ఆమె సర్దుకు పోవడం లేదని కొందరు భావిస్తున్నారట. పార్టీలోని ప్రత్యర్థికి ఏ పదవి రాకుండా ఉండాలనుకోవడం సరికాదంటున్నారు.
అవసరమైనప్పుడు అఖిలప్రియ రావట్లేదని అసంతృప్తి
మరోవైపు, పార్టీకి అవసరమైనప్పుడు అఖిలప్రియ బయటకు రావడం లేదనే అసంతృప్తి కూడా పార్టీ నేతల్లో ఉందని తెలుస్తోంది. ఉదాహరణకు ఇటీవల దాచేపల్లి అత్యాచార ఘటన సమయంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు అఖిల బయటకు రావాల్సి ఉండెనని, అవసరమైనప్పుడు ఆమె చొరవ చూపించడం లేదని భావిస్తున్నారట. దాచేపల్లి వంటి కీలక ఘటన సమయంలో వైసీపీ మహిళా నేతలకు గట్టి కౌంటర్ ఇవ్వకపోవడంపై ఆమె పట్ల పార్టీ పెద్దలు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.