వ్యవసాయ చట్టాలపై ఒత్తిడిలో వైసీపీ- జగన్ అస్త్రాన్నే వాడుతున్న టీడీపీ- సేమ్ సీన్ రిపీట్ ?
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలతో అధికార పార్టీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఏపీలోనూ పరిస్దితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. అయితే గతంలో పార్లమెంటులో ఇవే చట్టాలకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన వైసీపీ ఈ విషయంలో ఇప్పుడు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. పైకి గుంభనంగా కనిపిస్తున్నా వ్యవసాయ చట్టాలపై రైతుల నుంచి ఎదురవుతున్న నిరసనలకు తోడు విపక్ష టీడీపీ కూడా వీటిని వ్యతిరేకిస్తూ తమను టార్గెట్ చేస్తుండటంతో వైసీపీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. నిన్నటి భారత్ బంద్కు మద్దతుగా అధికారంలో ఉంటూ సర్కారీ ఆఫీసులు మూసేయాలని ఇచ్చిన ఆదేశాలే ఇందుకు నిదర్శనం.
వైసీపీకి సంకటంగా వ్యవసాయ చట్టాలు
కేంద్రం పార్లమెంటులో వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలో రైతుల నుంచి నిరసన వ్యక్తమైంది. విపక్ష పార్టీలు కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. అయినా పార్లమెంటులో తమకున్న బలంతో బీజేపీ వాటిని నెగ్గించుకుంది. అయితే లోక్సభలో ఎన్డీయే సర్కారుకు ఇతర పార్టీల మద్దతు అవసరం లేకపోయినా రాజ్యసభకు వచ్చేసరికి కీలక మిత్రపక్షం అకాలీదళ్ కూడా దూరం కావడంతో
వైసీపీ, టీడీపీల నుంచి ఏడుగురు ఎంపీలు మద్దతు పలికారు. మరికొందరు విపక్ష ఎంపీల మద్దతుతో అగ్రి బిల్లులను రాజ్యసభలోనూ ఎన్డీయే గట్టెక్కించుకుంది. అయితే అప్పట్లో పార్లమెంటు ఉభయసభల్లో ఈ బిల్లులకు మద్దతిచ్చిన వైసీపీ ఇప్పుడు రైతుల నిరసనలతో ఇరుకునపడింది. దీంతో నిన్నటి భారత్ బంద్కు కూడా మద్దతు ఇవ్వక తప్పలేదు.
ఇదే అదనుగా ఒత్తిడి పెంచుతున్న టీడీపీ...
తాము పార్లమెంటులో మద్దతిచ్చిన బిల్లుల విషయంలో వైసీపీ, టీడీపీ ఇద్దరూ యూ టర్న్ తీసేసుకున్నాయి. అయితే ఇందులో విపక్షంలో ఉన్న టీడీపీ కంటే అధికార పక్షంగా ఉన్న వైసీపీ ప్రధానంగా టార్గెట్ అవుతోంది. దీనికి పలు స్పష్టమైన కారణాలున్నాయి. పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బిల్లుల్ని పూర్తిగా సమర్ధించారు. బిల్లుల్ని వ్యతిరేకించే పార్టీలను దళారులన్నారు. దీంతో ఓ దశలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సాయిరెడ్డిని తిరిగి జైలు ఊచలు లెక్కబెట్టిస్తామని హెచ్చరించారు. అయితే టీడీపీ మాత్రం బిల్లులకు మద్దతిచ్చినా అందులో పలు మార్పులు సూచించింది. దీంతో ఇప్పుడు నిన్నటి భారత్ బంద్ సందర్భంగా అవే వీడియోలను బయటపెట్టి టీడీపీ చెలరేగిపోయింది. వైసీపీ మాత్రం కౌంటర్ ఇవ్వలేక మౌనంగా ఉండిపోయింది. ఇదే అదనుగా టీడీపీ ఇప్పుడు మరింత ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతోంది.
జగన్ మోడల్ ఫాలో అవుతున్న టీడీపీ
గతంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో టీడీపీ భాగస్వామిగా ఉండేది. వీరిద్దరి కాపురం సజావుగా సాగిపోతున్న సమయంలో ఈ జంటను విడగొట్టేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక హోదా అస్త్రాన్ని ప్రయోగించారు. ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పిన బీజేపీని వదిలిపెట్టి దాన్ని సాధించలేకపోతున్న టీడీపీని టార్గెట్ చేశారు. ఏపీలోని ప్రతీ జిల్లాల్లోనూ యువభేరులు నిర్వహించారు. దాదాపు ప్రతీ బహిరంగసభలోనూ టీడీపీని ఇదే అంశంపై టార్గెట్ చేశారు. చివరికి వైసీపీ ఒత్తిడి తట్టుకోలేక టీడీపీ కేంద్రానికి గుడ్బై చెప్పేసింది. ఆ తర్వాత నుంచి టీడీపీ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి గతేడాది ఎన్నికల్లోనూ టీడీపీని ఘోరపరాజయం వెంటాడింది. అప్పుడు జగన్ విసిరిన హోదా అస్త్రంతో దారుణంగా కుదేలైన టీడీపీ ఇప్పుడు అదే మోడల్ ఫాలో అవుతూ వ్యవసాయ బిల్లుల అస్త్రంతో జగన్ను టార్గెట్ చేయబోతోంది.
వ్యవసాయ చట్టాలపై జగన్ వెనక్కి తగ్గుతారా ?
పార్లమెంటులో కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులపై మిత్రపక్షాలు కూడా హ్యాండిచ్చేసిన తరుణంలో వాటికి మద్దతిచ్చి చట్టాలుగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన వైసీపీ ఇప్పుడు వాటిపై యూటర్న్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. ఓవైపు రైతులు, మరోవైపు టీడీపీ ఒత్తిడికి తలొగ్గి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన భారత్ బంద్కు ప్రభుత్వ శాఖలు మద్దతు ప్రకటించేలా చేసిన వైసీపీ సర్కారు ఇప్పుడు మరింత ఒత్తిడి ఎదురైతే కేంద్రాన్ని ఈ దిశగా చట్టాలు ఉపసంహరించుకోవాలని కోరుతుందా లేదా అన్న ప్రశ్న ఎదురవుతోంది. వైసీపీ కేంద్రాన్ని కోరినా కోరకున్నా టీడీపీ మాత్రం కేంద్రానికి ఈ మేరకు సూచన చేయాలని భావిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ చట్టాలపై టీడీపీ నేతలు కేంద్రానికి పలు సూచనలు చేస్తున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే వైసీపీ కూడా అదే బాట పట్టక తప్పదు.