'ముద్రగడకు ధ్వంసం చేయడం అలవాటే': తిరిగి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్
ఏలూరు: కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనకు పదవి లేనప్పుడు ఉద్యమం చేసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అలవాటేనని ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్ మంగళవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే తమకు సమ్మతమేనని చెప్పారు. రాజకీయ రిజర్వేషన్లలో స్పష్టత ఉండాలన్నారు. తమకు (బీసీలకు) మాత్రం అన్యాయం జరగకూడదని ఆయన చెప్పారు.
తిరిగి కేరళ వెళ్లిన పవన్ కళ్యాణ్
తుని ఘటన నేపథ్యంలో కేరళలో సినిమా షూటింగులో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆగమేఘాల పైన హైదరాబాద్ వచ్చి, సోమవారం నాడు విలేకరుల సమావేశంలో విధ్వంసంపై మాట్లాడిన విషయం తెలిసిందే.
సినిమా షూటింగులో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆదివారం సాయంత్రం వెంటనే హైదరాబాద్ బయలుదేరారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు విలేకరులతో మాట్లాడారు. తుని ఘటన పైన ప్రభుత్వాన్ని, పోలీసులను, అలాగే కాపు నేతలను ఆయన తప్పుపట్టినట్లుగా కనిపించింది.
షూటింగ్ మధ్యలో ఆపేసుకొని వచ్చిన పవన్ కళ్యాణ్ మంగళవారం తిరిగి కేరళ వెళ్లారు. సమాచారం మేరకు కేరళ అడవుల్లో రెండు మూడు సన్నివేశాలు తీయాల్సి ఉందని తెలుస్తోంది. ఆయన ఆగమేఘాల మీద హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో షూటింగ్ ఒకటి రెండు రోజులు పొడిగించే అవకాశముందని తెలుస్తోంది.