ఆదరణ అపూర్వం, ఏపీలో శాశ్వత అధికారం మాదే: బాబు, ‘ఏపీకి తొలిసారి రాష్ట్రపతి’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లోనే కాదు.. తెలుగుదేశం ప్రభుత్వమే శాశ్వతంగా అధికారంలో ఉంటుందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లోనే కాదు.. తెలుగుదేశం ప్రభుత్వమే శాశ్వతంగా అధికారంలో ఉంటుందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధిని ఆకాంక్షించేవారు తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థించాలని కోరారు. గురువారం సాయంత్రం ఆయన విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
అంకిత భావంతో ముందుకు..
‘రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వముంటేనే పెట్టుబడులు వస్తాయి. ప్రతి రోజూ రాజకీయ అస్థిరత ఉంటే ఎవరూ ముందుకురారు. రాజకీయ అస్థిరత ఏర్పడుతుందన్న అనుమానం వచ్చినా కూడా ఎవరూ ముందడుగేయరు. అభివృద్ధి కూడా అనుకున్నంత జరగదు. మా ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది' అని చంద్రబాబు తెలిపారు.
ఎవరొచ్చినా..
నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం తర్వాత కొందరు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు మీ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నట్టు వస్తున్న వార్తలు నిజమేనా? అన్న ప్రశ్నకు... ఆయన నేరుగా బదులివ్వకుండా, ప్రభుత్వానికి సహకరించేవారందరి మద్దతు తీసుకుంటామని బాబు తెలిపారు.
ఆదరణ అపూర్వం.. వైసీపీతో పోరాడుతూనే..
నంద్యాల ప్రజలు చూపిన ఆదరణ అపూర్వమని, అది రాత్రికి రాత్రే వచ్చిందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం చేసిన పనులు చూశాకే ప్రజలు మద్దతిచ్చారని చెప్పారు. శుక్రవారం నలుగురు మంత్రులు, 18 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు నంద్యాల వెళ్తున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా విపక్షం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా... ఒకపక్క వారితో పోరాటం చేస్తూనే, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటాం..
2019లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు నంద్యాల ఫార్ములానే అనుసరిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ... 2019లోనే కాదని, రాష్ట్రంలో శాశ్వతంగా టీడీపీనే అధికారంలో ఉంటుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉంటే ప్రజలకే మేలు జరుగుతుందన్నారు. కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా టీడీపీ నుంచి ఎవరికైనా అవకాశం ఉంటుందా? అన్న ప్రశ్నకు... వూహాజనిత ప్రశ్నలకు సమాధానం చెప్పడం సరికాదని, వారు అడిగితే చూద్దామని చెప్పారు.
రాష్ట్రపతికి ఘన స్వాగతం పలుకుతాం
భారత రాష్ట్రపతి హోదాలో తొలిసారి రాష్ట్రానికి వస్తున్న రామ్నాథ్ కోవింద్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సత్కరించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రాష్ట్రపతి వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆస్పత్రి ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక ఆయన బయటి రాష్ట్రాల పర్యటనకు రావడం ఇదే మొదటి సారని, అది కూడా ఏపీకే వస్తున్నారని చంద్రబాబు తెలిపారు.