వచ్చే ఎన్నికల్లో రికార్డులు బద్దలు కాబోతున్నాయి, ఆ బాధ్యత మీదే: నారా లోకేష్
కుప్పం: వచ్చే ఎన్నికల్లో రికార్డులు అన్నీ బద్దలవుతాయని మంత్రి నారా లోకేష్ శుక్రవారం అన్నారు. ఆయన కుప్పంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడారు. కార్యకర్తల ఉత్సాహం, ఉత్తేజం చూస్తుంటే 2019 ఎన్నికల్లో రికార్డులు బద్దలు కావడం ఖాయమన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబుదే అన్నారు. రూ.25వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.'
ఇటుక ఇటుక పేర్చి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. భావితరాల కోసం చంద్రబాబు కష్టపడుతుంటే బీజేపీ నడ్డి విరుస్తోందన్నారు. ప్యాకేజీ అంటూ మోసపూరిత వాగ్దానాలతో కేంద్రం మోసం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని రికార్డులు బద్దలు కాబోతున్నాయన్నారు.
గ్రూపు రాజకీయాలు మానుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంపై నేతలు దృష్టి పెట్టాలని పార్టీ నాయకులకు సూచించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అన్నారు. కుప్పం అభివృద్ధి బాధ్యత తమది అని, భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలది, ప్రజలది అన్నారు.