జగన్! తెలంగాణ మోసం చేస్తోంది, కెసిఆర్ పదవి పోతుంది: గాలి, హోదాపై..
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉందని టిడిపి శాసన మండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆదివారం అన్నారు. ప్రత్యేకహోదా రాకుండా కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి 32 నుంచి 42 శాతానికి పెంచినందుల్లే ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్రం భావిస్తున్నట్లు చెప్పారు. 11 రాష్ట్రాలకు ఏప్రిల్ 1 నుంచే ప్రత్యేక హోదా తొలగించారని వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కేంద్రంతో పోరాడుతుందన్నారు.
ప్రత్యేక హోదా కోసం మాట్లాడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని, సాధిస్తామని చెప్పారు.
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఇందిరా గాంధీ స్ఫూర్తి అయితే రాష్ట్రాన్ని విడగొట్టకపోయే వారన్నారు. ఏపీ రైతుల పైన రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. కర్నాటకలో రైతుల ఆత్మహత్యల కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే వైసిపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో మాట్లాడిన జగన్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్ పదవి పోవడం ఖాయమన్నారు. కెసిఆర్, రాహుల్లతో జగన్ చేతులు కలిపారని ఆరోపించారు.
ప్రత్యేక హోదా కోసం ఉద్యమం
ఏపీకి ప్రత్యేకహోదా వచ్చేవరకు ఉద్యమం తీవ్రతరం చేయాలని రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన సమితి నిర్ణయించింది. అనంతపురం మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో ఆదివారం డాక్టర్లు, వైద్య విద్యార్థులు ప్రత్యేక హోదా సాధన ప్రతిజ్ఞ చేశారు.
తెలుగు ప్రజలను విడదీసి కాంగ్రెస్ ప్రభుత్వ ఆంధ్రులను వీధుల్లో పడేస్తే, బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మరింత బికారులను చేయాలని చూస్తోందన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడాలన్నారు.