లోకేష్ మాటలు వింటే టీడీపీ 23సీట్ల నుండి 3 సీట్లకు పడిపోవటం ఖాయం : మంత్రి అవంతి శ్రీనివాస్
టీడీపీ అధినేత చంద్రబాబుపై, లోకేష్ పై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఫోన్ ట్యాపింగ్ పేరుతో చంద్రబాబు కొత్త కుట్ర కోణానికి తెరలేపారని, అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ కొత్త పథకం ఆవిష్కరించినప్పుడల్లా, ఏం చేయాలో అర్థం కాని చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్ళించడం కోసం ఆరోపణలు చేస్తున్నారని, రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు అని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
కొడుకు లోకేష్ ఆలోచనలతో చంద్రబాబు కూడా బ్రష్టు పట్టారని, చంద్రబాబు సొంతంగా ఆలోచించినంత కాలం రాజకీయాలు బాగానే చేశారని పేర్కొన్నారు. కొడుకు లోకేష్ ఎఫెక్టుతో ఇరవై మూడు సీట్లకు పార్టీ పడిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాయిని లోకేష్ దిగజార్చారని పేర్కొన్నారు. లోకేష్ మాటలు వినడం మాననంతకాలం టిడిపి పరిస్థితి అద్వానంగానే ఉంటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. లోకేష్ మాటలతో 23 సీట్ల నుండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో 3 సీట్లకు పడిపోవడం ఖాయమని మంత్రి అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందిస్తున్న పథకాలకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు అభద్రతాభావంతో ఉన్నారని మంత్రి అవంతి అభిప్రాయపడ్డారు. ప్రజలలో తమకు పుట్టగతులు ఉండవు అన్న నిరాశతో చంద్రబాబు ప్రభుత్వం చేసే మంచి పనులకు అడ్డుతగులుతూ,అభాసుపాలు అవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
రాజధాని వ్యవహారంలో ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి పరిమితం అయిన చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకున్నారని అన్నారు. మూడు ప్రాంతాల ప్రజలు ఓట్లేస్తేనే చంద్రబాబు సీఎం అయ్యారు అన్న విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారని గుర్తు చేశారు.
గతంలో మోడీని తిట్టిన నోటితోనే ఇప్పుడు పొగుడుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు ఉంటే ఇవ్వమని సాక్షాత్తు డీజీపీనే కోరినా చంద్రబాబు ఆధారాలు ఎందుకు ఇవ్వలేదని అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి అవంతి శ్రీనివాస్.