‘మండలి రద్దు’పై అసెంబ్లీ.: టీడీపీఎల్పీ కీలక నిర్ణయం, చంద్రబాబు హామీ, జగన్ సర్కారు అలా ముందుకు
అమరావతి: సోమవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభంకానున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని భావించిన టీడీపీఎల్పీ భేటీ.. సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించింది.
చంద్రబాబు హామీ.. తలవంచొద్దు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో అసెంబ్లీకి హాజరుకాకూడదనే నిర్ణయం తీసుకున్నారు. కష్టకాలంలో అండగా ఉన్నవారిని పార్టీ గుర్తిస్తుందని.. తగిన న్యాయం చేస్తుందన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు ఎవరూ ఆకర్షితులు కావొద్దని చంద్రబాబు ఈ భేటీలో నేతలకు సూచించినట్లు తెలిసింది. అధికార పార్టీ నేతల ప్రలోభాలకు తలవంచకపోవడం వల్లే మండలి రద్దుకు సర్కారు ప్రయత్నిస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జును ఈ సందర్భంగా తెలిపారు.
అందుకే టీడీపీ ఈ నిర్ణయం..
ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జగన్ సర్కారు ముందుకెళ్తోందని విమర్శించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని వైసీపీ సర్కారు గౌరవించడం లేదని మండిపడ్డారు. సంబంధం లేని మండలి గురించి శాసనసభలో చర్చించడం అప్రజాస్వామికమని, ఆ చర్చలో పాల్గొనాల్సిన అవసరం తమ సభ్యులకు లేదని స్పష్టం చేశారు. అందుకే సోమవారంనాటి అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ సభ్యులు హాజరుకావడం లేదని చెప్పారు.
వైసీపీ ప్లాన్ ఇలా..
ఇదిఇలావుంటే, శాసన మండలి రద్దుపై అసెంబ్లీలో ప్రభుత్వం సోమవారం తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాసనమండలి అవసరం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఉదయం జరిగే కేబినెట్ భేటీలో మండలి రద్దుకు ఆమోదం తెలిపి.. ఆ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదం పొందిన తీర్మానంను పార్లమెంటుకు పంపి మండలి రద్దు కోరే అవకాశం ఉంది.
Recommended Video
అంత ఈజీ కాదంటూ..
అయితే, శాసనమండలి రద్దు అంత సులభమైన పని కాదని టీడీపీ నేతలు అంటున్నారు. బెదిరింపులు తప్ప మండలిని ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం రద్దు చేయదని బుద్ధా వెంకన్న అన్నారు. వైసీపీలో ఎంతోమందికి ఎమ్మెల్సీ ఇస్తామనే హామీలు ఇచ్చారని.. అందుకే మండలిని రద్దు చేయరని అన్నారు. శాసనమండలి నుంచి ఎన్నికై మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలతో రాజీనామా చేయించిన తర్వాతే.. మండలిని రద్దు చేసే ప్రక్రియ మొదలుపెట్టాలని బుద్దా వెంకన్న వైసీపీ సర్కారుకు సవాల్ విసిరారు.