ఎన్నికల్లో టీడీపీ ఏకపక్ష విజయం, పవన్ కళ్యాణ్ అంగీకరించారు: కేసీఆర్ ప్లాన్ అప్లై చేస్తున్న బాబు
అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకపక్ష విజయం సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. సంక్రాంతి పండుగను తమ సొంతూరు నారావారిపల్లెలో జరుపుకున్నారు. సొంతూరులో జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం నారావారిపల్లెలోని టిటిడి కళ్యాణ మండపంలో మీడియాతో మాట్లాడారు.
రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. ప్రజలకు మేలు జరగాలని ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డామని, దాని ప్రభావం రాబోయే రోజుల్లో చూస్తారని చెప్పారు. మోడీ, కేసీఆర్, జగన్ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, అది సాధ్యం కాదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు, వారు మార్చలేరు
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా విజయం సాధించబోతోందని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే జనం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఏకమైనా జనం అభిప్రాయాన్ని మార్చలేరని చెప్పారు. చివరకు తాము చెప్పింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారని చెప్పారు. కేసీఆర్తో జగన్ కుమ్మక్కయ్యారని పవన్ కూడా చెప్పారన్నారు.
ఎన్నికల్లో మా అజెండా ఇదే
ఇలాంటి కుమ్మక్కు రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిప్పికొట్టబోతున్నారని చంద్రబాబు చెప్పారు. జగన్ ఏపీలో ఉంటూ ఏపీలో రాజకీయ పార్టీని నడుపుతూ ఏపీలో వ్యవస్థ మీద నమ్మకం లేదని చెబుతారా అని నిప్పులు చెరిగారు. ఇలాంటి వారిని ఏం చేయాలో జనమే నిర్ణయిస్తారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలను ఏపీలో అమలు చేశామని చెప్పారు. కేంద్రం సహకరించకపోయినా మోడీ అడుగడుగునా అడ్డుకున్నా అద్భుత ప్రగతి సాధించామన్నారు. ఇదే అజెండాతో ఎన్నికల్లో ముందుకు పోతామన్నారు.
ఏపీలో కేసీఆర్ ప్లాన్ అప్లై చేస్తున్న చంద్రబాబు
మళ్లీ తమ ప్రభుత్వం వస్తేనే ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతాయని చంద్రబాబు చెప్పారు. ప్రజలు కూడా టీడీపీ గెలిస్తేనే ఏపీ నిలబడుతుందని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోను కేసీఆర్ ఇదే చెప్పారు. తెరాస మళ్లీ గెలవకుంటే సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టులు ఆగిపోతాయని చెప్పారు. ఇది జనాల్లోకి వెళ్లింది. ఇప్పుడు చంద్రబాబు కూడా కేసీఆర్ ప్లాన్నే ఏపీలో అప్లై చేస్తున్నారు. పెన్షన్లు రెట్టింపు చేయడంతో జనంలో సంతోషం వెల్లివిరిసిందని చెప్పారు.
ఆ హక్కు టీడీపీకే ఉంది
ఆంధ్రప్రదేశ్లో ఓటు అడిగే హక్కు ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని చంద్రబాబు చెప్పారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వ్యతిరేకంగా పోరాడే పార్టీలు అన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా లేక ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటారా అని మీడియా ప్రశ్నించగా చంద్రబాబు స్పందిస్తూ... బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. తద్వారా తమతో ఎవరైనా కలిసి రావొచ్చునని కూడా సూచించారు.
తెలంగాణ వంటి ధనిక రాష్ట్రం చేయనిది మేం చేస్తున్నాం
జన్మభూమి కార్యక్రమంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు అన్నారు. జన్మభూమిలో ప్రజల భాగస్వామ్యం పెరిగిందని, స్మార్ట్, పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నామని, గ్రామాలలో చెత్త సేకరించి ఎరువుగా మారుస్తున్నామని, సమస్యలను రియల్ టైంలో పరిష్కరించగలిగామని చెప్పారు. పేదలకు ఆసరాగా నిలబడేందుకు భరోసా కల్పించామన్నారు. కేవలం పింఛన్లకే రూ.12వేల కోట్లు ఖర్చు అవుతోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా 100 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నామని, తెలంగాణ లాంటి ధనిక రాష్ట్రాలు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, వ్యవసాయ, ఉద్యాన పంటల్లో అనంతపురం, చిత్తూరు జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పారు. ఉద్యాన పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.