ఖమ్మంలో టిడిపి దూకుడు, నల్గొండలో తెరాసతో ఢీ
హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెసు, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ దూసుకు పోతోంది. టిడిపి తెలంగాణలో కూడా పరువు నిలబెట్టుకుంటోంది. విభజన నేపథ్యంలో తెలంగాణలో టిడిపి పూర్తిగా కనుమరుగు అవుతుందని అందరు భావించారు. కానీ తెలంగాణలోను సైకిల్ ఆశించిన దాని కంటే మించి ఫలితాలు సాధించిందనే చెప్పవచ్చు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది. తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కాంగ్రెసు, తెరాసల కంటే వెనుక బడి ఉంది. కానీ ఖమ్మంలో మాత్రం ఆ రెండింటి కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటోంది. సాయంత్రం ఏడు గంటల వరకు వచ్చిన ఫలితాల మేరకు... ఖమ్మం జిల్లాలో టిడిపి 160 ఎంపీటీసీలను, 1 జెడ్పీటీసీని గెలుచుకుంది. కాంగ్రెసు పార్టీ 52 ఎంపీటీసులను, 2 జెడ్పీటీసీలను గెలుచుకోగా, తెరాస 1 స్థానానికే పరిమితమైంది.
అదిలాబాదులో 51, కరీంనగర్లో 25, వరంగల్లో 31, నిజామాబాదులో 19, మెదక్లో 35, రంగారెడ్డిలో 68, మహబూబ్ నగర్లో 70 స్థానాలతో మూడో స్థానంలో ఉంది. నల్గొండలో 69 స్థానాలతో తెరాస(67)కు గట్టి పోటీనిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ 1324 ఎంపీటీసీలు, 47 జెడ్పీటీసులు, తెరాస 1094 ఎంపీటీసీలు, 98 జెడ్పీటీసీలు గెలుచుకోగా టిడిపి 588 ఎంపీటీసీలు, 7 జెడ్పీటీసులను గెలుచుకుంది.