జగన్ ఆటలు సాగలేదు: స్వీట్ తినిపించిన బాబు, అమెరికా వర్షాలపై..
నంద్యాల, కాకినాడలలో కుల రాజకీయాలు చేద్దామనుకున్న వైసిపి ఆటలు సాగలేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడలో గెలుపొందిన కార్పోరేటర్లకు ఆయన అభినందనలు తెలిపారు.
అమరావతి: నంద్యాల, కాకినాడలలో కుల రాజకీయాలు చేద్దామనుకున్న వైసిపి ఆటలు సాగలేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడలో గెలుపొందిన కార్పోరేటర్లకు ఆయన అభినందనలు తెలిపారు.
చదవండి: 30 ఏళ్ల తర్వాత టిడిపి.. జగన్కు కాకినాడ షాక్: మేయర్ రేసులో మహిళలు వీరే!
మంత్రులకు, పలువురు నేతలకు ఆయన మిఠాయి తినిపించారు. కాకినాడలో టిడిపి విజయదుందుభి అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలంతా టిడిపి వైపు ఉన్నారన్నారు. నంద్యాల, కాకినాడ ఫలితాలతో ప్రజల నాడి తెలిసిందన్నారు.
వైసిపి మాటలు నమ్మడం లేదు
ఇకపై మరింత బాధ్యతతో వ్యవహరించాలన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసిపి ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలు వైసిపి మాటలు నమ్మట్లేదన్నారు.
నేను చూడని రాజకీయాల్లేవు
తాను చూడని రాజకీయాలు ఏమీ లేవని చంద్రబాబు అన్నారు. ఎన్నికల వరకు ఆందోళన చేసిన వారు ఫలితాలు చూసిన తర్వాత మౌనం వహించారని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో గెలిస్తేనే సుస్థిరత వస్తుందని చెప్పారు.
ఆ సత్తా టిడిపికే ఉంది
సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే సత్తా టిడిపికే ఉందన్నారు. అభివృద్ధి అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తే అది కుదరదన్నారు. కులాలు, ప్రాంతాల మధ్య రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారన్నారు. బెల్టు షాపులపై కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. అవసరమైతే పిడి యాక్ట్ పెడతామన్నారు. ఏపీని అత్యంత నివాసయోగ్య రాష్ట్రంగా మార్చుతామని చెప్పారు.
తరుచూ ఎన్నికలు అభివృద్ధికి ఆటంకం
ఎన్నికలు అంతటా అయిదేళ్లకోసారి జరగాలని చంద్రబాబు అన్నారు. తరుచూ ఎన్నికలు అంటే అభివృద్ధికి ఆటంకం అని చెప్పారు. కాకినాడలో టిడిపి మంచి విజయం సాధించిందన్నారు. ప్రజలకు ధన్యవాదాలు, అభినందనలు అన్నారు. కాకినాడను స్మార్ట్ సిటీగా చేస్తామన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. నాయకులు సమష్టిగా, ప్రజలతో మమేకమై పని చేశారని కితాబిచ్చారు.
ప్రజలు సంతృప్తిగా ఉన్నారు
తమ మూడేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్నానని అన్నారు. విమర్శలు వచ్చినా పట్టిసీమను పూర్తి చేశామన్నారు. దీని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నా వ్యవసాయంలో అభివృద్ధి సాధించామని, ఏపీ నెంబర్ వన్గా ఉందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలన్నారు. టెక్నాలజీతో అవినీతిని అరికట్టాలన్నారు.
రూ.2వేల నోటు అవసరం లేదు
రూ.2వేల నోటు అవసరం లేదని చంద్రబాబు చెప్పారు. అలాగే, కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులపై పోటీ చేసిన టిడిపి రెబల్స్ అంశంపై కూడా స్పందించారు. నంద్యాల, కాకినాడ ఫలితాలపై విశ్లేషించుకుంటామని, లోటుపాట్లు ఉంటే సమీక్షించుకుంటామని చెప్పారు. ప్రజలు అబ్బురపడేలా అభివృద్ధి చేస్తామన్నారు.
అమెరికాలో వర్షాలపై..
అమెరికాలో వర్షాల వల్ల తెలుగు వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి టిడిపి ఎన్నారై విభాగం సహకరిస్తోందని తెలిపారు. కాగా, మంత్రి నారా లోకేష్ కాకినాడ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వానికి మరోసారి మద్దతు అని, ఇక స్మార్ట్ కాకినాడను తయారు చేద్దామని పేర్కొన్నారు.