రోజాపై తెలుగు దేశం పార్టీ మహిళా నేతల ఫిర్యాదు
విజయవాడ:పెనమలూరు టిడిపి ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైసిపి ఎమ్మెల్యే రోజా మధ్య మాటల యుద్దం నేపథ్యంలో వైకాపా-తేదేపా నేతలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటి రోజాపై పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చేసిన అర్ధరహితమైన వ్యాఖ్యలపై రోజా తరఫున హైకోర్టు న్యాయవాది సుధాకర్రెడ్డి పెనమలూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా...తాజాగా కంకిపాడు పోలీస్స్టేషన్లో వైకాపా ఎమ్మెల్యే రోజాపై నియోజవర్గం తెదేపా మహిళా నేతలు ఫిర్యాదు చేశారు.
ఈనెల 8వ తేదీన స్థానిక వైకాపా నాయకుడు పార్థసారథి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోజా పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ను కాల్ మనీ, సెక్స్ రాకెట్ మాఫియాకు చెందిన వారని, అటువంటి వ్యక్తి మరోసారి గెలవకుండా అడ్డుకోవాలని రోజా ఆరోపించారు. ఆమె ఆరోపణలను తెదేపా నాయకులు, మహిళా కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. రోజా వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని.. సినిమాలో చేసిన విధంగా రాజకీయాల్లో ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బోడె ప్రసాద్కు రోజా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రోజాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కంకిపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అంతకుముందు శనివారం కంకిపాడులో జరిగిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన గటురించి అర్థరహిత అనాలోచితమైన వ్యాఖ్యలు చేసి ఎమ్మెల్యేగా ఉంటూ భాష విషయంలో దారుణంగా మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమని, అందుకే అతనిపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలంటూ రోజా ఫిర్యాదు చేశారు.
రోజా ఆదేశాల మేరకు హైకోర్టు న్యాయవాది సుధాకర్రెడ్డి సీఐని కలిసి ఫిర్యాదుతో పాటు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడిన సీడీని అందజేశారు. అనంతరం స్టేషన్ పరిధిలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే మాట్లాడిన తీరుపై నిరసన వ్యక్తంచేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా వైసీపీ నాయకులు తాతినేని పద్మావతి, జానామణి, మండల అధ్యక్షుడు కిలారు శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేపై తప్పకుండా విచారణ చేపడతామని సీఐ దామోదరరావు తెలపడంతో వైసీపీ నాయకులు స్టేషన్ నుంచి వెనుదిరిగారు.