లిక్కర్ బ్రాండ్స్ తగ్గిపోయాయని టీడీపీ మహిళా ఎమ్మెల్యే వ్యాఖ్యలు: సభలో నవ్వులే నవ్వులు
నేడు ఏపీ అసెంబ్లీ లో మద్యపాన నిషేధం పై ఆసక్తికర చర్చ జరిగింది. మద్యం అక్రమ విక్రయాలపై, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన ఏపీ సర్కార్ ఎక్సైజ్ చట్టంలో పలు సవరణలు చేయాలని భావించింది. అందుకే నేడు సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నేపథ్యంలో జరిగిన చర్చలో టీడీపీ సభ్యులు మద్యపాన నిషేధంపై మాట్లాడారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని చేసిన వ్యాఖ్యలు సభలో అందర్నీ ఒక్కసారిగా నవ్వుకునేలా చేశాయి. ఇంతకీ ఆదిరెడ్డి భవాని ఏం మాట్లాడారంటే..
సంపూర్ణ మద్యపాన నిషేధం గురించి ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన మహిళా ఎమ్మెల్యే భవాని
ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వైన్ షాపులతో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సభలో మాట్లాడారు. ఇళ్ల మధ్యలో, దేవాలయాల వద్ద, స్కూల్స్ వద్ద కూడా చాలాచోట్ల వైన్స్ ఉన్నాయని, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. వైన్ షాప్ ల తో సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ ఇప్పుడు దశలవారీ నిషేధం అంటున్నారని ఇది మాట తప్పడం కాదా అధ్యక్షా అంటూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ప్రశ్నించారు.
మద్యం నియంత్రిస్తున్నట్టు భ్రమలు కల్పిస్తున్న సర్కార్ అంటూ భవాని వ్యాఖ్యలు
మద్యం విషయంలో ప్రభుత్వం తీరు చూస్తుంటే మద్యం నియంత్రిస్తున్నట్లు ప్రజలకు భ్రమ కల్పిస్తోందని చెప్పారు. షాపులు తగ్గించామని చెబుతున్నారని అన్నారు. కానీ మద్యం షాపుల ద్వారా ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం బాగానే వస్తుందని ఆమె పేర్కొన్నారు. చాలా మంది నిరుద్యోగులకు ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపుల్లో ఉద్యోగావకాశాలు కల్పించడం పై ఆమె అసహనం వ్యక్తం చేశారు. వారికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది మద్యం షాపుల్లో కాదు, వివిధ కంపెనీలలో అని ఆమె పేర్కొన్నారు.
లిక్కర్ బ్రాండ్స్ గురించి ఎమ్మెల్యే భవాని ఆసక్తికర వ్యాఖ్యలు
రాజమండ్రి సిటీలో మద్యం షాపులు ఇళ్లు, ఆలయాలు, స్కూళ్ల మధ్యలో ఉన్నాయని.. చాలామంది మహిళలు తనకు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తెలిపారు.షాపుల్లో పనిచేసేవాళ్లు బయట మద్యం అమ్మకాలు చేస్తున్నారని.. బెల్ట్ షాపులకు మద్యం వెళుతోందని, మాదక ద్రవ్యాల వినియోగం ఏపీలో బాగా పెరిగి పోయిందని ఆమె పేర్కొన్నారు. ఇక అంతే కాకుండా అక్కడితో ఆగక గతంలో లిక్కర్ బ్రాండ్స్ చాలా ఉండేవని పేర్కొన్న భవాని ఇప్పుడు తగ్గిపోయాయని మాట్లాడుతుండగా స్పీకర్ తో సహా సభ్యులందరూ నవ్వుకున్నారు.
ఆ బ్రాండ్స్ గురించి నీకెందుకు తల్లీ అన్న స్పీకర్
ఆ బ్రాండ్ల గురించి నీకెందుకు తల్లి వేరే వాళ్లు మాట్లాడతారు అంటూ స్పీకర్ నవ్వుతూ ఎమ్మెల్యే భవాని కి సలహా ఇచ్చారు. సభలో సభ్యులంతా ఈ విషయంపై పెద్దగా నవ్వారు. అయితే భవాని తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ ప్రస్తుతం అమ్ముడవుతున్న లిక్కర్ బ్రాండ్ ల మీద ప్రభుత్వం కమిషన్ తీసుకుంటుందని ఆరోపించారు. సంపూర్ణ మద్య నిషేధం త్వరితగతిన చెయ్యాలని వైసీపీ సర్కార్ కు సూచించారు టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని.