మోడీ! ఎ1 జగన్కు ఎలా ఇచ్చావ్, బిచ్చగాళ్లమా, పాకిస్తాన్ వాళ్లమా: టీడీపీ తీవ్రవ్యాఖ్య
విశాఖపట్నం: ఏపీలో మిత్రపక్షాలైన బీజేపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సై అంటే సై అంటున్నారు. ఒకరు ఒకటి అంటే మరొకరు రెండు అంటున్నారు. ఏమాత్రం తగ్గడం లేదు. సోమవారం విశాఖలో టీడీపీ నేతల నిరసన, విజయవాడలో మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. టీడీపీ నేతలు కూడా అంతెత్తున లేచారు.
లెక్క తీస్తాం, ఎవరి వల్ల ఆగాయో ఆధారాలు చూపిస్తాం: బాబుకు బీజేపీ షాక్, 'షా భయపడి ఫోన్ చేశారా'
బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాము విశాఖకు రైల్వే జోన్ పోరాటానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ధర్నాకు వచ్చిన వారిని రౌడీలు అంటారా అని నిప్పులు చెరిగారు.
బీజేపీని ప్రశ్నిస్తే వేలెత్తి చూపుతారా
నిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని గణేష్ చెప్పారు. 2019 తర్వాత బీజేపీ ఉంటుందో ఉండదో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు బీజేపీని ప్రశ్నిస్తే, ఆ పార్టీ వైపు వేలెత్తి చూపితే తమను నిందిస్తారా అని ప్రశ్నించారు.
మేం బిచ్చగాళ్లమా, పాకిస్తాన్ వాళ్లమా
బీజేపీని నిలదీస్తే ఏ1 నిందుతుడు అని మాట్లాడటం విడ్డూరమని వాసుపల్లి గణేష్ అన్నారు. మేం బిచ్చగాళ్లమా లేక పాకిస్తాన్ వాళ్లమా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను రక్షణ శాఖలో పని చేశానని చెప్పారు.
ఏ1 జగన్కు ప్రధాని అపాయింటుమెంట్ ఇచ్చారు
తాను ఏ కేసులకు భయపడనని, ప్రాణాలకు భయపడనని వాసుపల్లి గణేష్ తెలిపారు. ఏ1 నిందితుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోడీ అపాయింటుమెంట్ ఇస్తారని, కేసులు ఉన్న సీకే బాబును బీజేపీలో చేర్చుకుంటారని ఎద్దేవా చేశారు.
బీజేపీ చిన్నచూపు చూస్తోందని వంగలపూడి
ఏపీని బీజేపీ ఎందుకు చిన్న చూపు చూస్తోందని టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రశ్నించారు. రాయలసీమ పేరుతో బీజేపీ చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తోందని, ఏం చేస్తున్నారని నిలదీశారు. రోడ్డు మీదకు వస్తే ముద్దాయి అంటే ఎలా అని ప్రశ్నించారు. వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ బీజేపీ వాళ్లు చదువుతున్నారా, బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ వైసీపీ వాళ్లు చదువుతున్నారా తనకు అర్థం కావడం లేదన్నారు.
విష్ణు వ్యాఖ్యలపై ఆంజనేయులు ఆగ్రహం
మరోవైపు, విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యలపై టీడీపీ నేత ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై మాట్లాడేటప్పుడు బీజేపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడి హామీలు అమలు చేయించాలన్నారు. పార్లమెంటులో వైసీపీ పోరాటంలో చిత్తశుద్ధి లేదన్నారు.