ఓటు వేయకుండా దళితులను అడ్డుకున్న టీడీపీ నేతలు: ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపైనా దాడికి యత్నం
Recommended Video
గుంటూరు: గుంటూరు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మాచవరం మండలంలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని కొత్త గణేషుని పాలెంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లిన పలువురు దళితులను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకుని సంఘటనాస్థలానికి వెళ్లిన గురజాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిని కూడా తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. ఆయనను సైతం గ్రామంలోకి అడుగు పెట్టనివ్వలేదు. ఎందుకొచ్చావంటూ నిలదీశారు. గ్రామం వెలుపలే అడ్డుకుని, వెనక్కి పంపించేశారు. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డికి చెందిన రెండు కార్ల అద్దాలను కూడా వారు పగులగొట్టారు. దీనితో కొత్తగణేషుని పాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గురజాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యరపతినేని శ్రీనివాస రావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పోలింగ్ సందర్భంగా కొత్త గణేషుని పాలెం సమీప గ్రామాలకు చెందిన పలువురు దళిత ఓటర్లు ఓటు వేయడానికి వెళ్లగా.. స్థానిక టీడీపీ నాయకులు, యరపతినేని అనుచరులు అడ్డుకున్నారు. వారిని గ్రామంలోకి అడుగు పెట్టనివ్వలేదు. ఓటు వేయాల్సిన అవసరం లేదంటూ వెనక్కి తిప్పి పంపించేశారు. దీనితో వారు కాసు మహేష్ రెడ్డికి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తెలియజేశారు. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ.. స్థానిక టీడీపీ నేతలు తమను అడ్డుకుంటున్నారని ఆయనకు వివరించారు.
వెంటనే- కాసు మహేష్ రెడ్డి, తన అనుచరులతో కలిసి రెండు కార్లలో కొత్త గణేషుని పాలేనికి చేరుకున్నారు. దళిత ఓటర్లను వెంటబెట్టుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా.. టీడీపీ నాయకులు మరోసారి వారిని అడ్డుకున్నారు. కాసు మహేష్ రెడ్డిని కూడా వారు అడ్డగించారు. పోలింగ్ సజావుగా సాగుతోందని, అంతా తాము చూసుకుంటామని టీడీపీ నాయకులు మహేష్ రెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన దళిత ఓటర్లను తిప్పిపంపించేశారు. అక్కడితో ఆగలేదు. మహేష్ రెడ్డికి చెందిన రెండు కార్ల అద్దాలను కూడా పగుల గొట్టారు. దీనితో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.